బెయిల్ కోసం: బాబుదారిలో జగన్ నడుస్తున్నారా?

YS Jagan - Chandrababu Naidu
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్తుల కేసులో బాబు, మరికొందరు నాట్ బిఫోర్‌ను ఉపయోగించి కేసు తమకు అనుకూలమైన జడ్జి ముందుకు తెచ్చుకున్నారన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే నాట్ బిఫోర్‌ను ఉపయోగించి సుప్రీం కోర్టులో తన బెయిల్ పిటిషన్ జస్టిస్ జెఎస్ ఠాకూర్ ధర్మాసనం ముందుకు రాకుండా.. అత్యంత తెలివిగా వ్యవహరించారని అంటున్నారు.

రాష్ట్ర హైకోర్టులో చంద్రబాబు అండ్ కో నాట్ బిఫోర్‌ను ప్రయోగించి, కేసు తమకు అనుకూలమైన జడ్జి ముందుకు తెచ్చుకున్నారని అప్పట్లో వైయస్సార్ కాంగ్రెసు, జగన్ మీడియా ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు. నాట్ బిఫోర్ పైన బాబును తూలనాడిన జగన్ ప్రస్తుతం దానిని ఉపయోగించారని అంటున్నారు.

జస్టిస్ ఠాకూర్‌కు సంబంధించి నాట్ బిఫోర్ జాబితాలో ఉన్న సురేశ్ ష్రాఫ్ అండ్ కంపెనీని ఉపయోగించుకున్నారట. దీంతో... జగన్ బెయిల్ పిటిషన్ బెంచ్ మారింది. ఈనెల 9న అఫ్తాబ్ ఆలం ధర్మాసనం ముందుకు రానుంది. సిబిఐ కోర్టులో, హైకోర్టులో చుక్కెదురు కావడంతో... జగన్ తన బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ బెయిల్ పిటిషన్ గతనెల 23వ తేదీన జస్టిస్ ఠాకూర్, జస్టిస్ ఇబ్రహీం కలీఫుల్లాలతో కూడిన ధర్మాసనం ముందుకు రావాల్సి ఉంది.

ఆ రోజున ఈ ధర్మాసనం విచారణ జరపాల్సిన కేసుల్లో జగన్ బెయిల్ పిటిషన్ చివరి నుంచి రెండోది. అయితే... జగన్ తరఫు న్యాయవాది రామ్‌జెఠ్మలానీ అనూహ్యంగా ఈ బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. పిటిషన్‌లో మరిన్ని కొత్త అంశాలు జోడించాల్సి ఉందంటూ దీనిని వెనక్కి తీసుకున్నారు. దీనిని సవరించి మళ్లీ దాఖలు చేసేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. పిటిషన్‌లో సాంకేతికమైన లోపాలున్నాయని గుర్తించినా, మరింత బలమైన అంశాలు జోడించాల్సిన అవసరముందని భావించినా... ఇలా పిటిషన్ వెనక్కి తీసుకుని, తిరిగి దాఖలు చేయడం సాధారణమే.

అయితే.. సవరించిన పిటిషన్‌ను అదే న్యాయవాదితోనే దాఖలు చేయిస్తుంటారు. కానీ... జగన్ కేసులో జరిగింది వేరట. గతంలో జగన్ బెయిల్ పిటిషన్‌ను అడ్వకేట్ ఆన్ రికార్డ్ సెంథిల్ జగదీశన్ దాఖలు చేశారు. ఈసారి మాత్రం... న్యాయవాది మారిపోయారు. కొత్త పిటిషన్‌ను సురేశ్ ఎ.ష్రాఫ్ అండ్ కంపెనీ దాఖలు చేసింది. జగన్ గతంలో ఈ కంపెనీ సేవలను ఉపయోగించుకోలేదు. కానీ... ఈసారి మాత్రం ఆ కంపెనీని అడ్వకేట్ ఆన్ రికార్డ్‌గా పేర్కొంటూ బెయిల్ పిటిషన్ వేశారు.

ఇక్కడే అసలు మతలబు దాగుందని అంటున్నారు. జస్టిస్ ఠాకూర్‌కు సంబంధించిన నాట్ బిఫోర్ జాబితాలో సురేశ్ ఎ.ష్రాఫ్ కంపెనీ కూడా ఉంది. ఈ సంస్థ నుంచి దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ఠాకూర్ విచారణ జరపరు. అవి... మరొకరి ముందుకు వెళతాయి. అంటే, ఈ పిటిషన్ జస్టిస్ ఠాకూర్ ముందుకు రాకూడదనే సురేశ్ ఎ.ష్రాఫ్ కంపెనీని ఉపయోగించుకున్నట్లు అర్థమవుతుంది. జగన్ బెయిల్ పిటిషన్ బెంచ్ మారిపోయింది. ఈనెల 9వ తేదీన జస్టిస్ అఫ్తాబ్ ఆలం, రంజనా ప్రకాశ్ దేశాయ్‌ల బెంచ్ ముందుకు వస్తోంది. ఈ కేసును జస్టిస్ టిఎస్ ఠాకూర్ ధర్మాసనం ముందుకు పంపవద్దని కాజ్ లిస్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.

ఇదే నిబంధనను 'చంద్రబాబు అండ్ కో' తనకు అనుకూలంగా ఉపయోగించుకుంది అన్నది జగన్ ఆరోపణ. చివరికి... ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తమకు 'న్యాయం' జరగదని, ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వైయస్ విజయమ్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. "చంద్రబాబుపై వేసిన కేసు 8 బెంచ్‌లు మారింది. నాట్ బిఫోర్‌ను ప్రయోగించడమే దీనికి కారణం'' అని విజయమ్మ తరఫు న్యాయవాది రోహత్గి వాదించారు. అయితే... ఇది అవాస్తవమని రిలయన్స్ తరపు న్యాయవాది హరీశ్ సాల్వే, రామోజీరావు తరపు న్యాయవాది అనిల్ దివాన్ పేర్కొన్నారు.

"ఈ కేసు రెండు బెంచ్‌లు మాత్రమే మారింది. ప్రధాన న్యాయమూర్తి తనంట తాను విచారణ నుంచి తప్పుకొన్నారు. మరో బెంచ్‌పై వైయస్ విజయమ్మ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మేం ఒక్కదానిలో మాత్రమే వకాలత్ వేశాం'' అని వివరించారు. ధర్మాసనం మారిన ప్రతిసారీ న్యాయవాదులను కూడా మార్చారా? అని సుప్రీం న్యాయమూర్తి ప్రశ్నించగా... అలాంటిదేమీ లేదని హరీశ్ సాల్వే బదులిచ్చారు. దీంతో... 'చంద్రబాబు అండ్ కో' కేసు విషయంలో కావాలనే నాట్ బిఫోర్ ప్రయోగించారనే వాదనలతో కోర్టు విభేదించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+