Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైయస్సార్ ప్రత్యర్థులు, జగన్‌కు ప్రియులు

YS Jagan-YS Rajasekhar Reddy
హైదరాబాద్: రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చునంటారు. అంతేకాదు, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు కూడా ఉండరని అంటారు. అందుకు అనుగుణంగానే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆయన ప్రత్యర్థులుగా చెలామణి అయినవారు, ఆయనను తీవ్రంగా వ్యతిరేకించినవారు కూడా ఇప్పుడు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వస్తున్నారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలే వారిని ఈ దిశగా నెడుతున్నట్లు చెబుతున్నారు.

అలాంటివారిలో ప్రధానంగా డాక్టర్ ఎంవి మైసురా రెడ్డిని, ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డిని చెబుతున్నారు. వీరిద్దరు కూడా వైయస్ రాజశేఖర రెడ్డికి ప్రత్యర్థులే. కాంగ్రెసు పార్టీలో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రాబల్యం పెరగడం, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన ముందుకు రావడం వంటి కారణాలతో మైసురారెడ్డి ఆ పార్టీకి దూరమయ్యారు. అంతకు ముందు మంచి మిత్రులుగా ఉన్న ఉభయులూ ఆ తర్వాత వేరయ్యారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆధిపత్యం కారణంగానే మైసురా రెడ్డి కాంగ్రెసును వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరారని అంటారు.

వైయస్ రాజశేఖర రెడ్డిని కడప జిల్లాలో ఎదుర్కునేందుకు చంద్రబాబు నాయుడు మైసురా రెడ్డిని తన తెలుగుదేశం పార్టీలోకి అహ్వానించారు. ఆయనకు రాజ్యసభ సీటు కూడా ఇచ్చారు. వైయస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నంత వరకు మైసురా రెడ్డి ప్రత్యర్థిగానే పనిచేశారు. కరప్షన్ ఆఫ్ రాజా అనే తెలుగుదేశం వేసిన లఘు పుస్తకం రూపకర్త కూడా మైసురా రెడ్డే అని చెబుతారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేయడానికి తెలుగుదేశం పార్టీకి మైసురా రెడ్డి వెన్నెముకగా పనిచేశారని చెబుతున్నారు. అటువంటి మైసురా రెడ్డి ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కీలకమైన నేతగా మారారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వ్యూహాత్మక కార్యాచరణను, ఆలోచనాసరళిని అందించే నేతగా ఆయన మారిపోయారు.

ఇక, ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి విషయానికి వస్తే, వైయస్ రాజశేఖర రెడ్డిపై నిప్పులు చెరిగారు. నల్లగొండ జిల్లాలో తనకన్నా జూనియర్ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, రాంరెడ్డి దామోదర రెడ్డిని వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సహించి, ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డిని, పాల్వాయి గోవర్ధన్ రెడ్డిని పక్కన పెట్టారు. ప్రస్తుత మంత్ర జానా రెడ్డికి కూడా వైయస్ రాజశేఖర రెడ్డి ప్రాధాన్యం ఇవ్వలేదు.

అప్పట్లో ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా పలు ప్రకటనలు ఇచ్చారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి వైయస్ రాజశేఖర రెడ్డి మూడు ప్రాంతాలకు మూడు ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేసి, తెలంగాణ ప్రాంతీయ మండలికి ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డిని చైర్మన్‌గా చేశారు. ఈ పదవిలో ఆయన నిత్యం వైయస్ రాజశేఖర రెడ్డిపై ధ్వజమెత్తుతూ వచ్చారు. ఇప్పుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. ఏమైనా, వారు వీరవుతారంటే ఇదే కావచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+