ఫ్లెక్సీ రగడ: మహాత్మా గాంధీతో జగన్కు పోలిక
గుంటూరుకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత శ్రీనివాస రావు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. జగన్ను, మహాత్ముడిని పక్క పక్కన ఉంచి వారిద్దరినీ జైలులో ఉన్నట్లు ఆ ఫ్లెక్సీలో చిత్రీకరించారు. తెల్లదొరల కాలంలో మహాత్ముడు జైలుకు వెళ్లారని, నల్ల దొరల కాలంలో జగనన్న జైలుకు వెళ్లారని ఆ ఫ్లెక్సీలో రాశారు. అంతేకాదు ఓ మహాత్మా ఇది న్యాయమా అంటూ చివరలో రెండు వ్యాఖ్యలు కూడా రాశారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగింది.
గాంధేయవాదులు, స్వాతంత్ర్యాభిమానులు, సామాన్యులు, రాజకీయ నేతలు అందరూ దీనిని ముక్తకంఠంతో ఖండించారు, ఖండిస్తున్నారు. ఈ ఫ్లెక్సీ ఏర్పాటుపై జగన్ పార్టీ నేతలు కూడా మౌనం వహించారు. ఫ్లెక్సీ ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేసిన స్థానికులు అక్కడకు వచ్చి దానిని చించి వేశారు. ఇలాంటి ఫ్లెక్సీలు భవిష్యత్తులో ఏర్పాటు చేయకుండా తాజా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన శ్రీనివాస రావుపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జగన్ను గాంధీజీతో పోల్చడం సిగ్గు చేటు అన్నారు. న్యాయపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
దీనిపై పలువురు నగర పాలక కమిషనర్, అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి వచ్చారు. రేపటి లోగా నగర కమిషనర్, పోలీసులు శ్రీనివాస రావుపై చర్యలు తీసుకోవాలని ఉమా మహేశ్వర రావు అనే న్యాయవాది డిమాండ్ చేశారు. లేదంటే తాను గురువారం ఈ ఫ్లెక్సీపై కోర్టుకు వెళతానని హెచ్చరించారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలన్నారు.
గూండాలను వెంటేసుకొని తిరిగే జగన్ను మహాత్ముడితో పోల్చడం విడ్డూరమని కాంగ్రెసు సీనియర్ నేత వి హనుమంత రావు అన్నారు. గాంధీజీ ప్రపంచంలోనే మహోన్నతుడు అన్నారు. అలాంటి మహోన్నతుడికి జగన్కు పోలికా అన్నారు. తన భర్తను సోనియా చంపించిందని, హెలికాప్టర్ ప్రమాదం కాదని, తన కొడుకు ఏ తప్పు చేయలేదని చెప్పి ప్రజల్లో సానుభూతి పొంది మాత్రమే ఇటీవల ఉప ఎన్నికలలో ఆ పార్టీ గెలిచిందని, భవిష్యత్తులో ప్రజలు రియలైజ్ అవుతారన్నారు. ఇలాంటి రౌడీ మూకను రాష్ట్రం నుండి తరిమి కొట్టాలని విహెచ్ పిలుపునిచ్చారు.
జగన్ పార్టీ నేతలకు పిచ్చి ముదిరిందని, అది పరాకాష్టకు చేరుకుందన్నారు. గాంధీజీతో జగన్ను పోల్చిన వారిని అమాయకులుగా, శాడిస్టులుగా చెప్పవచ్చునని టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయనను జాతిపితగా ప్రపంచం గుర్తించిందని, జగన్ మాత్రం అవినీతి పితామహుడు అని ఎద్దేవా చేశారు. పోలిక సిగ్గుచేటు అన్నారు. అభిమానం హద్దులు దాటి వెర్రిగా మారిందన్నారు.