అఫ్జల్ గురు ప్రశాంతంగా, ఫ్యామిలీకి చెప్పలేదా..
ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువడిన తర్వాత అఫ్జల్ గురు పదేళ్ల పాటు తీహార్ జైలులో ఉన్నాడు. అతనికి ప్రత్యేక కోర్టు 2002లో ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 2001లో పార్లమెంటుపై దాడి కేసులో అతనికి ఉరిశిక్ష పడింది. అఫ్జల్ గురుకు 43 ఏళ్లు. అతను కాశ్మీర్లో సోపోర్కు చెందినవాడు.
అఫ్జల్ గురుకు ఉరిశిక్షను అమలు చేస్తున్న విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలిపినట్లు అధికారులు అంటున్నారు. అఫ్జల్ గురుకు ఉరి వేస్తున్న సమాచారాన్ని స్పీడ్ పోస్టు ద్వారా అతని కుటుంబ సభ్యులకు, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి తెలిపామని కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఆర్కె సింగ్ అన్నారు. సమాచారం గురు కుటుంబ సభ్యులకు చేరిందా, లేదా విషయాన్ని నిర్దారించుకోవాలని తీహార్ జైలు అధికారులు జమ్మూ కాశ్మీర్ పోలీసు డైరెక్టర్ జనరల్కు చెప్పినట్లు కూడా ఆయన వివరించారు.
అయితే, తమకు సమాచారం లేదని అతని సోదరుడు ముస్తాక్ గురు అన్నాడు. అఫ్జల్ గురు భార్య తబసుమ్కు కూడా సమాచారం లేదని ఎస్ఎఆర్ గిలానీ అంటున్నాడు. గిలానికీ పార్లమెంటుపై దాడి కేసులో విముక్తి లభించింది.
కనీస మానవహక్కుల సూత్రాలను కూడా విస్మరించారని ఆయన అన్నట్లు ఓ ప్రముఖ వార్తాసంస్థ తెలిపింది. ఈ మేరకు ఆ వార్తాసంస్థ గిలానీ మాటలను ప్రచురించింది. తబసుమ్కు టీవీ చానెళ్ల ద్వారానే సమాచారం తెలిసిందని ఆయన అన్నారు. ఆమె మెర్సీ పిటిషన్ పెట్టుకుందని, దాన్ని తిరస్కరిస్తున్నట్లు అధికారికంగా తెలియజేయాల్సిన అవసరం ఉంటుందని ఆయన అన్నారు.
కాశ్మీర్లో కర్ఫ్యూ విధించినందున తన భర్త మృతదేహం కోసం అధికారులను సంప్రదించే అవకాశం లేకుండా పోయిందని, తన భర్తను కూడా జెకెఎల్ఎఫ్ నేత మఖ్బుల్ భట్ను మాదిరిగానే తీహార్ జైలులోనే ఖననం చేస్తారనే భయంతో ఆమె ఉందని గిలానీ అన్నారు.