విభజన: నీళ్లు, హైదరాబాద్ తర్వాత నౌకాశ్రయం

ఉత్తరాంధ్ర మూడు జిల్లాలను తెలంగాణ ప్రాంతంలో కలపాలని డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క కోరుతున్నారు. కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కూడా ఇదే వాదనతో ఉన్నారట. తెలంగాణకు ఓ నౌకాశ్రయం ఉండాలని, దానికి ఉత్తరాంధ్ర జిల్లాలను తెలంగాణలో కలపడమే పరిష్కారమని చెబుతున్నారు.
ఆయన తన అభిప్రాయాన్ని ఉత్తరాంధ్ర నేతల ముందు పెడుతున్నారట. ఉత్తరాంధ్ర జిల్లాలను తెలంగాణలో కలిపితే ఇరు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, దీనికి మీరేమంటారని ఆయన వారిని అడగనున్నారట. కాగా, విభజనకు అనుకూలంగా సిడబ్ల్యూసి నిర్ణయం వచ్చినప్పటి నుండి పలువురు నేతలు వివిధ వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
తెలంగాణ ప్రాంత నేతలు హైదరాబాదు రాజధానిగా పది జిల్లాల తెలంగాణ కావాలని కోరుతున్నారు. భద్రాచలంపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ఖమ్మం జిల్లాలో ఎక్కువ మంది భద్రాచలం తెలంగాణదే అని చెబుతున్నారు. పలువురు సీమాంధ్ర నేతలు సమైక్యవాదం వినిపిస్తుండగా.. జెసి దివాకర్ రెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వంటి నేతలు మాత్రం విభజన అనివార్యమైతే కర్నూలు, అనంతపురంలను తెలంగాణలో కలపాలనంటున్నారు.
తమ ప్రాంతానికి నీరు, ఉద్యోగాలు కావాలంటే అదే పరిష్కారమంటున్నారు. ఇక ఉత్తరాంధ్ర కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ రాష్ట్రాన్ని మూడుగా చేసి, హైదరాబాదును యూటిగా చేయాలని, రాష్ట్రాన్ని మూడుగా విభజించాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధినేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
ఇక, కేంద్రమంత్రి చిరంజీవి సహా పలువురు నేతలు విభజన అనివార్యమైతే హైదరాబాదును యుటి లేదా ఉమ్మడి రాజధానిగా చేయాలంటున్నారు. మన్యసీమ డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు తిరుపతి తమదేనని తమిళ నాయకుడు చెబుతుండగా, తమ రాష్ట్రంలోని మూడు జిల్లాలను తెలంగాణలో కలపాలని 'మహా' నాయకుడు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications