విభజన: హైదరాబాద్పై నాలుగు ఆప్షన్లు?
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో రాజధాని హైదరాబాద్ కీలకంగా మారింది. సీమాంధ్ర నాయకులు హైదరాబాద్ తమకు లేకున్నా ఫరవా లేదు గానీ తెలంగాణకు కూడా దక్కకూడదనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. దీంతో హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా, దేశం రెండో రాజధానిగా ప్రకటించాలనే డిమాండ్లు ముందుకు వచ్చాయి. హైదరాబాద్ విషయంలో ఏ విధమైన పద్ధతిని అవలంబించడానికి అవకాశం ఉందనే విషయంపై మీడియాలో వార్తలు వచ్చాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సిఆర్) ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో ఉంది. కేంద్రపాలిత రాష్టమ్రైన ఢిల్లీ ప్రభుత్వానికి భూమి, శాంతి భద్రతలు, పోలీసు విభాగంపై నియంత్రణ ఉండదు.
దేశంలో పాండిచ్చేరి రాష్ట్రం కూడా కేంద్రపాలిత రాష్ట్రం. ఇక్కడ కూడా అసెంబ్లీ, ముఖ్యమంత్రి ఉన్నారు. యుటి చేయదలుచుకుంటే హైదరాబాద్ను కేంద్రపాలిత రాష్ట్రంగా అసెంబ్లీని ఏర్పాటు చేస్తారా? లేక పాత పద్ధతిలో ఢిల్లీ నగరం తరహాలో మెట్రో కౌన్సిల్కు పరిమితం చేస్తారా అనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. హైదరాబాద్ నగరాన్ని ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని ఏర్పాటు చేస్తామని, పదేళ్ల తర్వాత ఆంధ్రా ప్రభుత్వం వేరే రాజధానిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని సిడబ్ల్యుసి చెప్పింది.
హర్యానా, పంజాబ్కు ఉమ్మడి రాజధాని చండీగఢ్. హర్యానాకు ఐదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా చండీగఢ్లో అవకాశం కల్పించారు. 1967 నుంచి 1972 వరకు హర్యానా చండీగఢ్ కేంద్రంగా పనిచేయాలి. కానీ 42 ఏళ్లు గడచిన తర్వాత కూడా హర్యానా చండీగఢ్ నుంచి మారలేదు. ప్రస్తుతం హైదరాబాద్ను యుటి చేసే విషయంలో నాలుగు మార్గాలను పరిశీలిస్తున్నట్టు సమచారం ఉందంటూ శనివారం వార్తలు వచ్చాయి.
1. హైదరాబాద్ను పదేళ్లపాటు కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని చేస్తారు. ఇక్కడ హైదరాబాద్ అంటే హైదరాబాద్ రెవెన్యూ జిల్లా (ఎక్కువ భాగం పాతబస్తీ కలిపి 175 చ.కిమీ, లేదా గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (625 చ.కిమీ) లేదా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (7025 చ.కిమీ) అనే దానిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.
2. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ను ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ తరహాలో హైదరాబాద్ క్యాపిటల్ రీజియన్గా (హెచ్సిఆర్) మార్చే అవకాశం ఉంది.
3. హైదరాబాద్ క్యాపిటల్ రీజియన్గా ఏర్పాటు చేస్తే ఢిల్లీ తరహాలో హెచ్సిఆర్కు అసెంబ్లీ ఉంటుంది. హెచ్సిఆర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. కానీ వీరికి పబ్లిక్ ఆర్డర్, పోలీసు, భూమి తదితర కీలకాంశాలపై చట్టాలను రూపొందించడం, ఎగ్జిక్యూటివ్ అధికారాలు ఉండవు.
4. ఒకవేళ హైదరాబాద్ క్యాపిటల్ రీజియన్కు అసెంబ్లీ అక్కర్లేదనుకుంటే, ఈ పరిధిపై తెలంగాణ రాష్ట్రానికి నియంత్రణ ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. కానీ పబ్లిక్ ఆర్డర్, పోలీసు, భూమి, ఫీజులు, రెవెన్యూపై తెలంగాణ ప్రభుత్వానికి అధికారాలు ఉండవు. ఇంకా కోర్టులు కూడా కేంద్రం పరిధిలో ఉంటాయి. హైదరాబాద్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ను పాలకుడిగా నియమిస్తారు.
వీటిలో నాల్గవ ప్రతిపాదన రాజ్యాంగం ప్రకారం అమలు కావడం సాధ్యం కాదనే అభిప్రాయం ఉంది. కానీ మిగిలిన పైమూడు ప్రతిపాదనలు రాజ్యాంగ సవరణ ద్వారానే హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది. హెచ్సిఆర్ను కేంద్రపాలిత రాష్ట్రంగా చేస్తే మూడు రాష్ట్రాలుగా విభజించినట్టవుతుంది. హెచ్ఎండిఏ పరిధిని కేంద్రపాలిత రాష్ట్రంగా ప్రకటిస్తే తప్పని సరిగా ఢిల్లీ తరహాలో ఒక అసెంబ్లీని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
రాజ్యాంగంలోని 239ఎ, 239ఎఎ ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటు, అధికారాలు ఉంటాయంటూ వార్తలు వచ్చాయి. లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మినిస్ట్రేటర్గా ఉంటారు. పబ్లిక్ ఆర్డర్ అంటే నౌకా, మిలిటరీ, వైమానిక దశాలు, పోలీసు అంటే రైల్వే, రాష్ట్ర పోలీసు విభాగాలు, భూమి అంటే భూమిపైన హక్కులు, లీజులు, అద్దె, అద్దె వసూళ్లు, బదలాయింపులు, వ్యవసాయ భూములు, భూముల అభివృద్ధి, వ్యవసాయ రుణాలు అన్నీ కేంద్రం చేతిలో ఉంటాయి.