పురంధేశ్వరికి అసమ్మతి సెగ: వెనక చిరంజీవి?
టి. సుబ్బిరామిరెడ్డికి అనుకూలంగానే చిరంజీవికి అత్యంత సన్నిహితులైన గంటా శ్రీనివాస రావు, గత ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు పురంధేశ్వరిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారనే మాట వినిపిస్తోంది. పురందేశ్వరి అహంకారంతో వ్యవహరిస్తున్నారని విశాఖ జిల్లా భీమునిపట్నం ఎమ్మెల్యే ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావు మండిపడ్డారు. పీఆర్పీ నుంచి గెలిచిన తన పట్ల వివక్షతో వ్యవహరిస్తున్నారని, ఆ ఎమ్మెల్యేలే లేకపోతే జగన్ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో సముద్రంలో కలిసిపోయి ఉండేదన్నారు.
భీమిలిలో ఆదివారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో పురంధేశ్వరిపై విరుచుకుపడ్డారు. అందరినీ కలుపుకొని పోవాల్సిన కేంద్ర మంత్రి పురంధేశ్వరి వర్గాలను ప్రోత్సహిస్తూ పార్టీని బలహీనపరుస్తున్నారని విమర్శించారు. రాజకీయంగా తనను అణగదొక్కడంతోపాటు భీమిలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు ఆమె కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రితోమాట్లాడి తాను తీసుకువచ్చిన రూ.10 కోట్ల నిధులతో చేపట్టే అభివృద్ధిపనులకు తనకు చెప్పకుండా ఆమె ఎలా శంకుస్థాపనలు చేస్తారని ప్రశ్నించారు.
కేంద్రమంత్రిగా నాలుగేళ్లలో భీమిలికి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని పురందేశ్వరిని కోరారు. 'ఆమె స్థాయిలో ఆమె గొప్ప అయితే...నా స్థాయిలో నేను గొప్ప' అన్నారు. ఇప్పటికైనా ఆమె పద్ధతి మార్చుకుని తన నియోజకవర్గంలో జరిగే అధికార, అనధికార కార్యక్రమాలపై తనకు సమాచారం ఇస్తే ఘన స్వాగతం పలికి కార్యక్రమాలను విజయవంతం చేస్తామన్నారు.
రాజకీయాల్లో గ్రూపులు నడపడమనేది తమ ఇంటా... వంటా లేదని, స్వచ్ఛమైన రాజకీయాలతో ప్రజలకు సేవ చేయడమే తమ తత్వమని కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. ఆదివారం వేములవలస వచ్చిన ఆమె కార్యకర్త ల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ ఒకే కుటుంబ సభ్యులుగా ఉంటారే తప్ప, భేదాలు చూపరన్నారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం అయిన తర్వాత కూడా ఆ పార్టీ, ఈ పార్టీ అని అనుకోవడం విచారకరమన్నారు.
విశాఖపట్నం జిల్లాలో గంటా శ్రీనివాస రావు, పురంధేశ్వరి వర్గాల మధ్య తలెత్తిన వివాదంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి విశాఖ జిల్లా పర్యటన సందర్భంగా ఇరు వర్గాలు పోటీ పడి హైడ్రామా చేశాయి. ఇది కిరణ్ కుమార్ రెడ్డికి నచ్చలేదని అంటున్నారు.