ప్యాచప్: సబ్బం మంత్రాంగం, కెవిపి రాయబారం?

పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి సాంకేతికంగా కాంగ్రెసులో ఉన్నప్పటికీ జగన్ పార్టీకి బహిరంగంగా మద్దతు ఇస్తున్నారు. హైదరాబాదులోని చంచల్గూడ జైలులో ఉన్న జగన్ను గురువారం సబ్బం హరి కలిశారు. ఆయనతో పాటు జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి కూడా ఉన్నారు. కొద్ది సేపటి తర్వాత సుబ్బారెడ్డి బయటకు వచ్చేశారు. జగన్తో సబ్బం ఏకాంతంగా మాట్లాడారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై సుమారు 45 నిమిషాలపాటు చర్చించుకున్నారు.
తనకు బెయిల్ రాకుండా 2014 ఎన్నికల వరకూ జైలులోనే ఉండేలా కాంగ్రెస్ అధినాయకత్వం చూస్తోందని జగన్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసిందంటూ పత్రిక రాసింది. ప్రస్తుత తరుణంలో జైలులో ఉండడంకంటే బయటకు రావడమే మంచిదని సబ్బం హరి సలహా ఇచ్చారని సమాచారం. కాంగ్రెస్తో చేయి కలిపేందుకు సిద్ధం కావడమే మంచిదని, ఈ దిశగా మనసు మార్చుకోవాలని సబ్బం హరి జగన్కు సూచించినట్లు తెలిసింది.
జగన్ మాత్రం తన మనసులోని మాట బయట పెట్టలేదని రాజకీయ వర్గాలు అంటున్నాయంటూ వార్తాకథనం ప్రచురించిన పత్రిక వ్యాఖ్యానించింది. ఈ విషయమై సబ్బం హరిని సంప్రదించామని, తాను జగన్తో సమావేశమైన మాట వాస్తవమేనని అంగీకరించారని ఆ పత్రిక రాసింది. అయితే, ఆయనతో మాట్లాడిన విషయాలు బయటకు చెప్పేవి కావన్నారని తెలిపింది.
"మేమిద్దరం ఏకాంతంగా మాట్లాడుకున్నాం. మా మధ్య జరిగిన సంభాషణ వేరేవారికి తెలిసే అవకాశమే లేదు. సోనియాగాంధీతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఏకాంతంగా మాట్లాడిన అంశాలనే ప్రత్యక్షంగా విన్నట్లుగా రాజకీయ కథనాలు వస్తుంటాయి. నా విషయంలోనూ అలాగే వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు'' అని సబ్బం తెలిపారని ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది.
జగన్తో రాయబారం నడపడం, దీని వెనుక కెవిపి హస్తం ఉందనడం అంతా ఉత్తిదే అని సబ్బం హరి తమ ఢిల్లీ ప్రతినిధికి తెలిపినట్లు ఆ పత్రిక రాసింది. "అప్పుడెప్పుడో ప్రణబ్ ముఖర్జీ దగ్గరకు వెళ్లినప్పుడు జగన్ను కలిశాను. చాలాకాలం తర్వాత గురువారం మళ్లీ కలిశాను. ఇద్దరం రాష్ట్ర రాజకీయాలపై చర్చించుకున్న మాట నిజమే. అసదుద్దీన్, అక్బరుద్దీన్ అరెస్టుల గురించి జగన్ అడిగారు'' అని సబ్బం హరి చెప్పినట్లుల రాసింది.












Click it and Unblock the Notifications