కొత్తగా జగన్: క్లారిటీలేని దాడి, బాబు ధీమావల్లే

వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన దాడి.. తాను ఊహించిన జగన్ వేరు... చూసిన జగన్ వేరు అంటూ శనివారం మీడియాతో చెప్పారు. ఇన్నాళ్లు తాను చేసిన విమర్శలు టిడిపి తరఫున మాత్రమే చేశానని వివరించారు. తద్వారా దాడి జగన్, వైయస్ రాజశేఖర రెడ్డిలకు క్లీన్ చిట్ ఇచ్చినట్లయిందంటున్నారు. అదే సమయంలో ఇన్నాళ్లు తాను టిడిపి తరఫున విమర్శలు చేశానని, త్వరలో జగన్ పార్టీ తరఫున వివరణ ఇస్తానన్నారు.
ఇన్నాళ్లు జగన్ అవినీతిపరుడు అంటూ మాట్లాడిన దాడి క్లారిటీ లేకనే మాట్లాడారా? అని ప్రశ్నిస్తున్నారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత స్థాయిలో ఎదురు దాడి చేసిన వ్యక్తి చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సి వస్తుందంటున్నారు. మరోవైపు తాను ఆత్మగౌరవం కోసమే పార్టీని వీడానని, టిడిపిలో ప్రాధాన్యత లేదని చెప్పారు. తాను ఎక్కడున్నా ఎన్టీఆర్ ఆశయాల కోసం పని చేస్తానని, టిడిపిని వీడుతుంటే తన కుటుంబ సభ్యులు ఏడ్చారని చెప్పారు.
అయితే, జగన్ అవినీతి పైన నాడొక మాట నేడొక మాట మాట్లాడటాన్ని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. దాడి టిడిపిలో ఉండగా.. జగన్, వైయస్ అవినీతి పైన నిప్పులు చెరిగారు. అలాంటి నేత ఇప్పుడు అదే పార్టీలో చేరడాన్ని ప్రజలు చీదరించుకుంటారంటున్నారు. ఎమ్మెల్సీ స్థానంతో అలక వహించిన దాడి జగన్ పార్టీలో చేరుతున్నారని అందరికీ అర్థమైపోయిందని, మార్పుపై దాడి వ్యాఖ్యల్లో పస లేదంటున్నారు.
మరోవైపు.. చంద్రబాబు వైఖరి కారణంగానే దాడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాల్సిన పరిస్థితి వచ్చిందని మరికొందరు అంటున్నారు. దాడి సున్నిత మనస్కుడు అని, పార్టీ పట్ల నిబద్దతతో ఉండే వ్యక్తి అని, ఎంత సున్నితమనస్కుడో తేడా వస్తే అంతే కఠినంగా వ్యవహరిస్తారని తెలిసినప్పటికీ బాబు ఎమ్మెల్సీ టిక్కెట్ విషయంలో పొరపాటు చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దాడి చెప్పినట్లుగా ముందే ఎమ్మెల్సీ స్థానంపై సమాచారం అందించి ఉంటే బాగుండేందంటున్నారు.
అలా చేయక పోవడం వల్ల సీనియర్ నేత అయిన దాడి పార్టీనీ వీడాల్సి వచ్చిందంటున్నారు. అయితే, దాడికి చంద్రబాబు ఎక్కడ లోటు చేయలేదని, అవసరమైనప్పుడు మళ్లీ అవకాశం ఇస్తానని చెప్పారని టిడిపి నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా దాడి ఎక్కడకు వెళ్లరనే అతి ధీమా వల్ల కూడా దాడిని జగన్ పార్టీకి కోల్పోవాల్సి వచ్చిందంటున్నారు.












Click it and Unblock the Notifications