పిక్చర్స్: ఆధిపత్య పోరులో చిరు సహా అగ్రనేతలు
హైదరాబాద్: రాష్ట్రంలోని ముఖ్య నాయకుల మధ్య విభేదాలు లోలోపల చిచ్చు పెడుతున్నాయి. రాష్ట్రానికి చెందిన నలుగురు ముఖ్య నాయకులు ఆధిపత్యం కోసం పోరాటం సాగిస్తున్నారు. బయటకు కనిపించకపోయినప్పటికీ వారి వ్యవహారశైలిని బట్టి చూస్తే ఆ విషయం బోధపడుతుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కేంద్ర మంత్రి చిరంజీవి మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో అగ్ర నేతగా ముందుకు వచ్చేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బొత్స సత్యనారాయణ వర్గం ఆయనను ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నాలు చేస్తోంది. అందుకు విరుగుడుగానే మద్యం కుంభకోణంలో బొత్స పాత్రను ముఖ్యమంత్రి వర్గీయులు ముందుకు తెచ్చారనే ప్రచారం అప్పట్లో ముమ్మరంగా సాగింది. ఆ వివాదం తీప్రం కావడంతో పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అవకాశం దొరికినప్పుడల్లా ఒకరిపై మరొకరు ఆధిక్యత సాధించడానికి ఎత్తులు పైయెత్తులు వేస్తూనే ఉన్నారు.
విధానపరమైన నిర్ణయాల్లో ముఖ్యమంత్రి తీరు ఒక రకంగా ఉంటే పార్టీపరంగా బొత్స సత్యనారాయణ మరో వైఖరిని వెల్లడిస్తున్నారు. తద్వారా ముఖ్యమంత్రిని ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా, బయ్యారం వివాదం ముఖ్యమంత్రికి, పిసిసి చీఫ్కు మధ్య గొడవకు దారి తీసినట్లు తెలుస్తోంది. బయ్యారం గనుల విషయంలో ముఖ్యమంత్రి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని బొత్స మండిపడుతున్నట్లు తెలుస్తోంది.
ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దామోదర రాజనర్సింహ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై అసంతృప్తితోనే ఉన్నారు. ఇరువురు నేతలు దాదాపు ఎడమొహం పెడమొహంగానే వ్యవహరిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తనకు హోం శాఖను అప్పగిస్తారని దామోదర రాజనర్సింహ భావించారు. అయితే, ఆ దిశగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోలేదు. అప్పటి నుంచే ఇరువురి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ క్రెడిట్ను దక్కించుకోవాలని దామోదర రాజనర్సింహ ప్రయత్నించారు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి వర్గం ఆయనకు ఆ క్రెడిట్ దక్కకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతోంది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ క్రెడిట్ అంతా తనదేనని కూడా ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నారు. దీంతో దామోదర రాజనర్సింహకు ముఖ్యమంత్రిపై మంటగా ఉందని అంటున్నారు. ఇందిరమ్మ కలలు పేరిట ముఖ్యమంత్రి రాష్ట్రమంతా పర్యటిస్తున్నా దామోదర రాజనర్సింహ దూరంగానే ఉంటున్నారు.
ఇదిలావుంటే, చిరంజీవి మరో మార్గంలో రాష్ట్ర నాయకత్వం కోసం పోటీ పడుతున్నారు. తన వర్గానికి చెందిన మంత్రి సి. రామచంద్రయ్య ద్వారా ఎప్పటికప్పుడు చిరంజీవి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చిరంజీవిని ముందుకు తెచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. దీనికి కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుపుల్లలు వేస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రిపై చిరంజీవి బహిరంగంగానే విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. మొత్తంమీద, కాంగ్రెసు పార్టీలో ఆధిపత్యం పోరు రంజుగానే సాగుతోంది.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వివిధ పథకాల ద్వారా ప్రజలకు దగ్గర కావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు చట్టబద్దత నుంచి అన్ని పథకాలకు ఆయనే క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి సారథ్యం వహించేందుకు ఆయన ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఇరకాటంలోకి నెట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి తీసుకునే ఏకపక్ష నిర్ణయాలను, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అడ్డుకుంటున్నట్లుగా బయటకు కనిపించడానికి అవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి తీరుపై దామోదర రాజనర్సింహ కినుకతో ఉన్నారు. తనకు హోం శాఖను కేటాయించకపోవడం నుంచి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్కు చట్టబద్దత కల్పించిన విషయంలో తనకు తగిన క్రెడిట్ దక్కకుండా ఆ క్రెడిట్ను ముఖ్యమంత్రి కొట్టేసే ఏర్పాటు చేసుకోవడం వరకు జరిగిన పరిణామాలు దామోదర రాజనర్సింహకు రుచించడం లేదు.

కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చిరంజీవికి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఆశలు సన్నగిల్లినట్లు లేవు. వచ్చే ఎన్నికల్లో చిరంజీవిని రాష్ట్ర కాంగ్రెసుకు పెద్ద దిక్కుగా నిలబెట్టడానికి ఆయన వర్గానికి చెందిన కాంగ్రెసు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నాయకుల్లో చాలా మంది ఇంతకు ముందు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నవారే.












Click it and Unblock the Notifications