ఆస్తుల కోసం బ్రదర్ అనిల్, వైయస్ వివేకా ఫైట్
ఏవైనా సమస్యలు ఉంటే పాస్టర్స్ కౌన్సిల్ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని, ఇందులో బయటివారు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని, తమ మనుషులను పంపి పాస్టర్లను ఎందుకు బెదిరిస్తున్నారని, ఒక చేత్తో బైబిల్ పట్టుకొని మరో చేత్తో చర్చిల ఆస్తులు దోచుకుంటున్నారని ఆరోపించారు. క్రైస్తవుల ఓట్లు కావాలి గాని చర్చిలకు మాత్రం ఆస్తులు ఉండకూడదా అని ప్రశ్నించారు. క్రైస్తవ ద్రోహులుగా వ్యవహరిస్తున్నారని డేవిడ్ శాంతారాజ్ ఆగ్రహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ నాయకులంతా ఇదే మాదిరిగా చర్చిల ఆస్తులపై పడి కబ్జా చేస్తున్నారని, ప్రభుత్వ ఆస్తుల దోపిడీ తర్వాత ఇప్పుడు క్రైస్తవుల ఆస్తులపై పడ్డారని ఆయన మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే గుర్నాథ రెడ్డి క్రైస్తవుల ఆస్తులను కబ్జా చేశారని ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లాలో పిల్లి సుభాష్ చంద్రబోస్ అనుచరులు సంస్థల ఆస్తులను అనేకచోట్ల ఆక్రమించారని ఆరోపించారు.
వైయస్ అల్లుడు వృద్ధాశ్రమం, అనాథాశ్రమం పెడతానని చెప్పి హైదరాబాద్లోని మణికొండలో ప్రభుత్వ స్ధలం తీసుకున్నాడని, ఇక అనిల్, వివేకా అనుచరులు హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని చర్చి వద్ద కొట్టుకున్నారని, ఈ తగాదాలన్నీ ఆస్తుల కోసం తప్ప క్రైస్తవ సంక్షేమం కోసం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి చర్చి ఆస్తులను కాపాడాలని, లేకపోతే పెద్ద ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. దీనిపై ముఖ్యమంత్రిని కూడా కలుస్తామని చెప్పారు.