బాబు యాత్ర: లోకేష్ స్పీచ్, జూ.ఎన్టీఆర్ దూరం?

బాలకృష్ణ వివిధ జిల్లాల్లో పాదయాత్రలో పాలు పంచుకున్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అటువైపు తొంగి చూడలేదు. షూటింగ్లో ఉన్నానని, తరువాత పాదయాత్రలో పాల్గొంటానని ప్రారంభంలో జూనియర్ సినిమా ఫంక్షన్లో చెప్పారు. అయితే, గాయపడినప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో చంద్రబాబును పరామర్సించారు. ఆరునెలలపాటు సాగిన చంద్రబాబు పాదయాత్ర ఏప్రిల్ 20న విశాఖపట్నంలో భారీ బహిరంగ సభతో ముగియనుంది. కానీ, ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ పాదయాత్రలో పాల్గొనలేదు. పార్టీ నేతలు సైతం ఆయన్ని దూరంగానే పెడుతున్నారు.
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ విజయవాడలో పర్యటించినప్పుడు పార్టీ నేతలెవరూ కార్యక్రమంలో పాల్గొనవద్దంటూ ఆదేశాలు వెళ్లాయి. పార్టీ వారెవరూ జూనియర్కార్యక్రమానికి వెళ్లలేదు. బాలకృష్ణ కట్టడివల్లే పార్టీ నేతలు జూనియర్ను దూరంగా పెడుతున్నారన్న వార్తలు రావడంతో, తనకు జూనియర్తో ఎలాంటి విబేధాలు లేవని బాలకృష్ణ ప్రకటించారు. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబుకు తోడుగా బాలకృష్ణ, నారా లోకేశ్ పార్టీలో చురుకైన పాత్ర పోషించేందుకు సిద్ధపడుతుంటే, జూనియర్ మాత్రం దూరంగానే ఉంటున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు బాలకృష్ణ ప్రకటించారు. 2009 ఎన్నికల్లోనే ఆయన ప్రచారానికి వెళ్లే ముందు అసెంబ్లీకి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే పోటీ చేయడం ద్వారా ఒక నియోజక వర్గానికి పరిమితం కావడంకన్నా పార్టీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రాష్టవ్య్రాప్తంగా ప్రచారం చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉందని చంద్రబాబు నచ్చజెప్పారు. ఈసారి మాత్రం ఎలాగైనా అసెంబ్లీకి పోటీ చేయాలని బాలకృష్ణ భావిస్తున్నారు.
బాలకృష్ణ పార్లమెంట్కు పోటీ చేస్తారని టిడిపి నేతలు ప్రచారం చేస్తుంటే, ఆయన మాత్రం అసెంబ్లీకే పోటీ చేస్తానని బహిరంగంగానే ప్రకటించారు. తన తండ్రి గతంలో ప్రాతినిధ్యం వహించిన గుడివాడ నియోజక వర్గంలో ఇప్పటికే బాలకృష్ణ విస్తృతంగా పర్యటించారు. గుడివాడ నుంచి బాలకృష్ణ పోటీ చేసే అవకాశం ఉంది. ఇక లోకేశ్ సైతం ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం సాగుతున్నా, ఆయన మాత్రం పోటీ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏప్రిల్ 20న చంద్రబాబు జన్మదినం సందర్భంగా విశాఖపట్నంలో జరిగే భారీ బహిరంగ సభలో నారా లోకేశ్ రాజకీయ ఉపన్యాసం చేయనున్నారు. మేలో జరిగే మహానాడులో బాలకృష్ణకు, లోకేశ్కు పార్టీలో బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.
2009 ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆ తరువాత జరిగిన పరిణామాలతో పార్టీకి దూరంగానే ఉంటున్నారు. తనకు ఇప్పుడు సినిమాలే ముఖ్యమని, రాజకీయాల గురించి మాట్లాడేంత వయసు తనకు లేదని ఎన్టీఆర్ చెబుతున్నారు. టిడిపి నేతలు ఉద్దేశ పూర్వకంగా తనను పార్టీకి దూరం చేస్తున్నారని, తన సినిమా గురించి వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తున్నారని జూనియర్ అసంతృప్తితో ఉన్నారు. 2011లో జరిగిన మహానాడులో వేదికపైనే నందమూరి హరికృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు వేదికపై మాట్లాడమని ఆయన్ని యనమల రామకృష్ణుడు ఆహ్వానిస్తే, ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు. తమ కుటుంబాన్ని ఉద్దేశ పూర్వకంగా చంద్రబాబు దూరం చేస్తున్నారని, ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల మధ్య మరోసారి విబేధాలు సృష్టిస్తున్నారని హరికృష్ణ అసంతృప్తితో ఉన్నారు. మహానాడు తరువాత ఈ విబేధాలు మరింతగా బహిర్గతమయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications