జగన్ పార్టీకి కొండా సురేఖ ఫట్: బిజెపి లేదా తెరాస?

తెంలగాణ ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి బలమైన నేతగా ఉన్న కొండా సురేఖతోపాటు ఆమె భర్త కొండా మురళి పార్టీని వీడాలన్న ఆలోచనకు వచ్చేందుకు కారణం పార్టీ అధిష్ఠానం పోకడలే కారణమని అంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డికి వీరాభిమానులుగా ఉంటూ వచ్చిన కొండా దంపతులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. వైయస్ కూడా సురేఖకు తన మంత్రి వర్గంలో చోటు కల్పించటంతోపాటు మురళిని శాసనమండలికి ఎంపిక చేశారు. వైయస్ కుటుంబంతో బలమైన అనుబంధాన్ని పెనవేసుకుంటూ వచ్చిన కొండా దంపతులకు రాజశేఖరెడ్డి ఆకస్మిక మృతి పెద్ద దెబ్బగానే మారింది.
వైయస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా ఆయన తనయుడు జగన్ను ముఖ్యమంత్రిని చేయాలంటూ గళం విప్పారు. చివరకూ తన మంత్రిపదవికి రాజీనామాచేసి జగన్కు అండగా నిలిచారు. జగన్ సారథ్యంలో ఏర్పడ్డ కొత్తపార్టీలో చేరారు. తన శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తెలంగాణలో వీస్తున్న సెంటిమెంట్ గాలులను సైతం ఎదుర్కొనేందుకు సిద్ధ్దపడ్డారు. ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు కాంగ్రెస్పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఇక ఆనాటి నుంచే కొండా దంపతులపట్ల పార్టీలో ప్రత్యేకించి వైయస్ కుటుంబంలో రెండో అలోచన మొదలైందంటున్నారు.
అందుకు తగ్గట్టుగానే పార్టీ వ్యవహారాలు కూడా నడుస్తూ వస్తున్నాయి. తెలంగాణలో పార్టీకి బలమైన నేతగా ఉన్న స్ధాయి నుంచి జిల్లాస్ధాయి నేతకు పరిమితం చేస్తూ వచ్చారు. చివరకు వరంగల్ జిల్లాస్థాయి నాయకత్వం కూడా ప్రశ్నార్ధకంగా మార్చారు. వరంగల్ జిల్లాలో పార్టీ కన్వీనర్ పదవుల ఎంపికలో కూడా కొండా దంపతుల మాట చెల్లుబాటు కాని పరిస్థితి వచ్చేసింది.
పార్టీ అధిష్ఠానం పోకడలను జీర్ణించుకోలేక కొండా అనుచరులు అవేదనతో పార్టీ కార్యాలయ వద్ద ఇటీవల నిరసనలు తెలిపారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని, పార్టీ కార్యాలయానికి తాళం వేశారని ఆగ్రహించిన పార్టీ అధిష్ఠానం నోటీసులు జారీ చేసింది. దీనిపై కొండ దంపతులు మరింత మనస్తాపానికి లోనయినట్టు సమాచారం.
కొండా దంపతులు తెలంగాణ రాష్ట్ర సమితిలోకి గానీ బిజెపిలోకి గానీ వెళ్లే అవకాశాలున్నాయనే చర్చ కూడా పార్టీ ముఖ్యనేతల్లో జరుగుతోంది. జగన్తోనే విభేదాలు రావటంతో, పార్టీలో వారి తరఫున మాట్లాడే వారు కరువయ్యారని తెలుస్తోంది. కాగా, తెలంగాణవ్యాప్తంగా అసంతృప్తిగా ఉన్న పార్టీ నేతలను మురళి కూడగడుతున్నారనే అనుమానాలు కూడా అధిష్ఠానానికి ఉన్నాయి. ఈక్రమంలోనే ఇటీవల వరంగల్ జిల్లాలో నియోజకవర్గ సమన్వయకర్తల నియామకంలో కొండా దంపతుల సిఫారసులను పార్టీ అధిష్ఠానం పెద్దగా పట్టించుకోలేదు.
కాగా, మరోవైపు మాజీమంత్రి కొండా సురేఖను తిరిగి కాంగ్రెస్ గూటికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయి. ఇందుకోసం తెలంగాణ ప్రాంతానికి చెందిన పార్టీ సీనియర్ నేత ఒకరు కొండా దంపతులతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే కొండ దంపతులు మాత్రం పార్టీ వీడే ఆలోచనలో ఉన్నట్టు ఇంత వరకూ ఎక్కడా బయట పడలేదు. కానీ, వారు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఇమిడే పరిస్థితి మాత్రం లేదంటున్నారు.












Click it and Unblock the Notifications