శ్రీనివాసన్తో లింక్స్తో ధోనీ మౌనం: గంగూలీ వేరే
స్పాట్ ఫిక్సింగ్పై మాట్లాడడానికి ధోనీకి ఎప్పుడు సమయం వస్తుందో తెలియదు. క్రికెట్ పరువు ప్రతిష్టలను మంట గలుపుతున్న స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై భారత క్రికెట్కు నాయకత్వం వహిస్తున్న ఆటగాడు మాట్లాడకపోవడం ఒక రకంగా విచిత్రంగానే కనిపిస్తుంది. అయితే, బిసిసిఐ చీఫ్ ఎన్ శ్రీనివాసన్తో ఉన్న సంబంధం వల్లనే ఆయన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై పెదవి విప్పడం లేదనే మాట వినిపిస్తోంది.
బిసిసిఐ చీఫ్ శ్రీనివాసన్కు చెందిన ఇండియా సిమెంట్స్కు ధోనీ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. సాంకేతికంగా చెన్నై సూపర్ కింగ్స్ తనది కాదని శ్రీనివాసన్ చెబుతున్నా అది ఆయనదనే విషయం బహిరంగ రహస్యమే. శ్రీనివాసన్కే చెందిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోనీ నాయకత్వం వహిస్తున్నాడు. శ్రీనివాసన్ అల్లుడు గురనాథ్ మేయప్పన్ బెట్టింగ్ వ్యవహారంలో అరెస్టయ్యాడు.
స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం గురించి మాట్లాడడం ప్రారంభిస్తే వాటిన్నింటిపై మీడియా ప్రతినిధుల నుంచి ప్రశ్నలు వస్తాయనే విషయం ధోనీకి తెలుసు. అందుకే, మొత్తంగానే వ్యవహారంపై మాట్లాడకుండా ఉంటే సరిపోతుందనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు కనిపిస్తున్నాడు.
భారత క్రికెట్కు విజయాలను రుచి చూపించిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ. మొదటి మ్యాచ్ ఫిక్సింగ్ కేసు 2000లో వెలుగు చూసింది. మొహ్మద్ అజరుద్దీన్, అజయ్ జడేజా అప్పుడు మ్యాచ్ పిక్సింగ్ వ్యవహారంలో చిక్కుకున్నాడు. అప్పుడు గంగూలీ కెప్టెన్గా ఉన్నాడు. అతను ధోనీలా మౌనంగా ఉండిపోలేదు. పైగా, ధోనీ - తన జట్టును అన్నింటి నుంచి దూరంగా ఉంచాలని అనుకుంటున్నానని, చాంపియన్స్ ట్రోఫీ తమకు అత్యంత ముఖ్యమైందని, ఇది మ్యాచు పిక్సింగ్ గురించి మాట్లాడే సమయం కాదని చెప్పేసి దాటేసే ప్రయత్నం చేశాడు. ప్రస్తుత పరిస్థితి వల్ల క్రికెట్ పరువు ఏమీ పోలేదని ధోనీ అన్నాడు.
గంగూలీ ఏమన్నాడు...
"ఇతర జట్ల గురించి నాకు తెలియదు. నిశ్చితం కాని ఆరోపణలు తమ ఆటగాళ్లపై ఏ విధమైన ప్రభావం చూపవు.
ఎవరు ఏం చెప్పినా, నీ పట్ల నువ్వు నిజాయితీగా ఉండడమనేది అత్యంత ముఖ్యమని నేను వ్యక్తిగతంగా భావిస్తాను. నీ ఆత్మకు నువ్వు నిజాయితీగా ఉంటే, ఏ ఆరోపణ కూడా నిన్ను తాకదు. మైదానంలో మేం క్రికెట్పైనే దృష్టి కేంద్రీకరించాలి.
మేం ఏం చేయలేం. ఆరోపణలు వినకుండా ఎవరికి వారు తమ తమ విధులను నిర్వహించడం ద్వారా మాత్రమే దాన్ని దాటగలం"