పిక్చర్స్: పొలిటికల్ క్రాస్రోడ్స్లో సినీ తారలు
హైదరాబాద్: సినీరంగంలో ఓ వెలుగు వెలిగి రాజకీయాల్లోకి వచ్చిన తెలుగు సినీ తారల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. రాజకీయాల్లో వారి భవిష్యత్తు ఎప్పటికప్పుడు ప్రమాదంలో పడుతోంది. ఏ రాజకీయ పార్టీలోనూ సరిగా ఇమడలేక సతమవుతున్నారు. సినీ రంగంలో హీరోలకు సమానంగా వారు ప్రేక్షకాదరణను పొందినవారే. నటనలోనూ గ్లామర్లోనూ ప్రజల్లో తమకంటూ ఓ స్థానాన్ని అక్రమించుకున్నారు. రాజకీయాల్లో కూడా దూకుడుగానే వ్యవహరిస్తున్నారు.
జయప్రద, జయసుధ, విజయశాంతి, రోజా, కవిత - ఇలా సాధారణ ఎన్నికలు నమీపిస్తున్న తరుణంలో రాజకీయాల్లో చౌరస్తా వద్ద నించున్నారు. జయప్రద ఏ పార్టీలో చేరుతారనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. కవిత రాజకీయాలపై వైరాగ్యం ప్రదర్శిస్తున్నారు. రోజా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్లమెంటు సభ్యురాలు విజయశాంతికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఎత్తుగడలతో ఊపిరి ఆడడం లేదని అంటున్నారు.
జయసుధ అనూహ్యంగా వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చి కాకలు తీరిన తెలుగుదేశం పార్టీ హైదరాబాదు నగర నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ను ఓడించి శాసనసభలో అడుగు పెట్టారు. కానీ, ఎప్పటికప్పుడు రాజకీయాల తీరు పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఆమెకు ఏ రాజకీయ పార్టీ కూడా నచ్చడం లేదు.
వచ్చే ఎన్నికల్లో ఈ తారలకు టికెట్లు లభిస్తాయా, లేదా అనేది కూడా అనుమానంగానే ఉంది. ఒకవేళ దక్కినా తమకు నచ్చిన సీట్లు దక్కుతాయా లేదా అని కూడా చెప్పలేని స్థితి. రాజకీయ పార్టీల నాయకత్వాల చేతుల్లో వారి భవిష్యత్తు ఆధారపడి ఉంది. నిజానికి, వారంతా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెసు సికింద్రాబాద్ శాసనసభ్యురాలు జయసుధ రాజకీయాల పట్ల తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఆమెకు హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తిక రెడ్డి నిప్పు పెడుతున్నారు. ఇరువురి మధ్య చాలా కాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో జయసుధ పోటీ చేసే పరిస్థితి ఉంటుందా, లేదా అనేది అనుమానంగా ఉంది. వైయస్ ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చిన జయసుధ కొంత కాలం వైయస్ జగన్ వెంట నడిచారు. కానీ, అక్కడి వాతావరణం ఆమెకు నచ్చినట్లు లేదు. దీంతో కాంగ్రెసులోనే కొనసాగుతున్నారు.

లేడీ బాస్గా, లేడీ అమితాబ్గా సినీరంగంలో హీరోలకు సమానంగా ఇమేజ్ను సంపాదించుకున్న తెలంగాణ రాములమ్మ విజయశాంతికి కెసిఆర్ పొగ పెడుతున్నట్లు తెలుస్తోంది. మెదక్ పార్లమెంటు సీటును ఆమెకు ఇవ్వకూడదని ఆయన అనుకుంటున్నారట. ఆమెకు అసలు టికెట్ ఇస్తారా, లేదా అనేది కూడా అనుమానంగానే ఉంది. బిజెపిలో అద్వానీ వంటి నేతల అభిమానం పొందిన విజయశాంతి తెలంగాణ తల్లి పార్టీని స్థాపించి, దాన్ని నిర్వహించలేక తెరాసలో విలీనం చేశారు. ఇప్పుడు తెరాసలో ఆమెకు కష్టాలు వచ్చిపడ్డాయి.

జయప్రద గురించి చెప్పనే అక్కర్లేదు. ఆమె రాజకీయాలు రాష్ట్ర సరిహద్దులు దాటాయి. తెలుగుదేశం పార్టీలో తెలుగు మహిళ అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమె తర్వాత సమాజ్వాదీ పార్టీలో చేరి ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ ఎంపిగా గెలుస్తూ వచ్చారు. సమాజ్వాదీ పార్టీ నుంచి అమర్సింగ్తో పాటు బహిష్కరణకు గురి కావడంతో ఆమె చౌరస్తాలో నించున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తానంటూ ఏ పార్టీలో చేరుతారో చెప్పడం లేదు. ఆమెను చేరదీసి రాజమండ్రి టికెట్ ఇచ్చే పార్టీ ఏది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రోజా రాజకీయాల్లో దూకుడు ప్రదర్శిస్తూ వచ్చారు. తెలుగుమహిళ అధ్యక్షురాలిగా ఆమె తెలుగుదేశం పార్టీ ఉద్యమాలకు ఊపునిచ్చారు. మహిళశక్తిని కూడగట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించారు. శాసనసభ టికెట్ లభించినప్పటికీ విజయం సాధించలేకపోయారు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.

సినీ తార కవిత తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో తనకంటూ ఓ స్థానం కోసం కృషి చేశారు. పార్టీలో ఆమెకు గుర్తింపు ఉన్నట్లు లేదు. దాంతో ఆమె రాజకీయాల పట్ల వైరాగ్యం ప్రదర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications