రాయల తెలంగాణ వెనక్కి: హైదరాబాద్ బాధ్యత

తెలంగాణ ఏర్పడితే హైదరాబాదులోని సీమాంధ్రులకు, వారి ఆస్తుల రక్షణకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు, ఆస్తుల పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని శాంతి భద్రతలతోపాటు కొన్ని కీలక అధికారాలను కేంద్రం చేతుల్లోనే ఉంచుకునే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే విషయంపై చర్చలు సాగుతున్నట్లు సమాచారం.
హైదరాబాద్ను ప్రత్యేక పరిపాలన యంత్రాంగం పరిధిలో ఉంచే విషయంపై న్యాయ, రాజ్యాంగ నిపుణులతో చర్చిస్తున్నారు. హైదరాబాద్కు సంబంధించి తెలంగాణ ప్రజలను నొప్పించకుండా, సీమాంద్రులను ఒప్పించే పరిష్కార మార్గం కనుక్కోవడంపై దృష్టిసారించారని తెలుస్తోంది.
హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే తెలంగాణ నేతలు, ముస్లింలు అంగీకరిచే పరిస్థితి లేదని అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించకుండా, సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఏం చేయాలనే అంశంపై చర్చించి, 'భద్రతకు మాదీ బాధ్యత' అనే హామీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
సాధ్యమైనంత త్వరలోనే రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభించాలని, వచ్చేనెల 5 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లును ఆమోదించాలని కేంద్రం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ నెలాఖరులోపే సిడబ్యుసి నిర్ణయం జరిగిపోతుందని, ఆ వెంటనే తదుపరి దశల అమలు జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు అనేది సుదీర్ఘ ప్రక్రియ కాబోదని, నీటి పంపిణీ, సిబ్బంది బదిలీలు, వనరుల కేటాయింపులన్నీ శాస్త్రీయమైన పద్ధతిలో, నిపుణుల ద్వారా జరుగుతాయని అంటున్నారు.
మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్కు తెలంగాణపై స్పష్టమైన సంకేతాలు అందినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ముందుగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ప్రక్రియ ప్రారంభించడం కన్నా కేంద్రమే నిర్ణయం తీసుకుని, రాష్ట్రపతి ద్వారా అసెంబ్లీ అభిప్రాయానికి నివేదించడమే సరైనదని కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్కు సంకేతాలు అందినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications