రాజీనామా చేసి పార్లమెంటుకు: వారు మౌనం
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే సీమాంధ్ర ప్రాంత ఎంపీలు తమ గళాన్ని నిండు సభలో వినిపించారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు సభలో స్పీకర్ మీరా కుమార్ పోడియను చుట్టి ముట్టి జై సమైక్యాంధ్ర, సీమాంధ్రకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. సీమాంధ్ర సభ్యుల నినాదాలతో సభను తొలుత అర్థ గంట వాయిదా వేసిన మీరా కుమార్.. ఆ తర్వాత ప్రారంభమైనప్పటికీ.. పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేకపోవడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలంటూ సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేయగా, సీమాంధ్రకు న్యాయం చేయాలంటూ టీడీపీ సభ్యులు సభలో నినాదాలు చేశారు. దీంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజే ఉభయసభలు రాష్ట్ర విభజన అంశంపై హోరెత్తాయి. సభ కార్యకలాపాలను అడ్డుకున్నారు.
అయితే అదే సమయంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు మాత్రం మౌనంగా తమకేమీ పట్టనట్లు కూర్చున్నారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు దగ్గుబాటి పురంధేశ్వరి, తదితరులు గొడవ గురించి తమకేమీ పట్టనట్లు మౌనంగా కూర్చున్నారు.