బాబూ లోకేష్ షో: హరి, ఎన్టీఆర్ నో (పిక్చర్స్)
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పాదయాత్ర ముగింపు సభ నారా, నందమూరి కుటుంబాల మధ్య మరింతగా నిప్పును రాజేసే సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖపట్నంలో శనివారం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. పైలాన్ ఆవిష్కరించే శివాజీనగర్ నుంచి భారీ బహిరంగ సభ జరిగే ఎయు ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు ఎక్కడ చూసినా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లే కనిపిస్తున్నాయి.
పార్టీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు మచ్చుకైనా కనిపించడం లేదు. నందమూరి వంశానికి చెందిన ఫ్లెక్సీలు లేకపోవడాన్ని కొంత మంది తప్పు పడుతున్నారు. ఈ సభకు హరికృష్ణ హాజరవుతారని చెబుతూ వచ్చారు. కానీ తాజా పరిణామం ఎటు దారి తీస్తుందో తెలియని పరిస్థితిని కల్పించింది. పార్టీ అధిష్టానం నుంచి అందిన సమాచారం మేరకే నందమూరి వంశానికి చెందినవారి ఫ్లెక్సీలు లేకపోవడానికి కారణమనే విమర్శ వినిపిస్తోంది.
అక్టోబర్ 2న అనంతపురం జిల్లా హిందూపూర్ నుండి ప్రారంభమైన చంద్రబాబు పాదయాత్ర గురువారం నాటికి 2,800 కి.మీ పూర్తి చేసుకుంది. 16 జిల్లాలు 84 నియోజకవర్గాలు 160 మండలాలు, 1246 గ్రామాలను 206 రోజులుగా పాదయాత్రలో చంద్రబాబు చుట్టారు. శనివారం విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర ముగియనుంది. సుమారు ఆరు నుండి ఎనిమిది లక్షల మంది వరకు విశాఖ బహిరంగ సభకు రావచ్చని ఆ పార్టీ నేతల అంచనా.
చంద్రబాబు 63 ఏళ్ల వయస్సులోనూ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పాదయాత్ర సాగించారు. మహబూబ్నగర్ జిల్లా గద్వాలలో సభా వేదిక కుప్ప కూలడంతో చంద్రబాబు నాయుడు కాలికి బలమైన గాయమైంది. దీంతో నాలుగైదు రోజులు పాదయాత్రకు బ్రేక్ పడింది. వైద్యులు పాదయాత్ర వద్దని వారించినా చంద్రబాబు నాయుడు తన పట్టుదల వదలలేదు. గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని ఓ గ్రామంలోనూ మరో సారి చంద్రబాబుకు ఇదే అనుభవం ఎదురైంది. అక్కడ కూడా సభా వేదిక కూలడంతో బాబు కాలి నొప్పి మరో సారి తిరగబెట్టింది.
చంద్రబాబు నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్పై, ఆయన తండ్రి హరికృష్ణ పై ఎక్కుపెట్టిన బాణం దించేది లేదన్నట్లే వ్యవహరిస్తున్నారని వినికిడి. తన పాదయాత్ర ముగింపు సభలో వారిద్దరికి ప్రాధాన్యం లేకుండా ఆయన జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. తన కుమారుడు నారా లోకేష్కు తన వారసత్వాన్ని అందించేందుకు కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తున్నారు.
తండ్రి తర్వాత నారా లోకేష్ తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించే సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా జరిగిన ఏర్పాట్లను చూస్తే ఆ విషయం అర్థమవుతుందని అంటున్నారు. విశాఖ బహిరంగ సభ సందర్భంగా ఎక్కడ చూసినా తండ్రీకొడుకుల ఫ్లెక్సీలు, కటౌట్లు కనిపిస్తున్నాయి.
చంద్రబాబు పాదయాత్ర ముగింపు సభకు నందమూరి హరికృష్ణ హాజరవుతారని గట్టిగానే చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన హాజరవుతారా లేదా అనేది చెప్పలేమనే మాట వినిపిస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు కచ్చితంగానే వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నంలో జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ బొమ్మలు కనిపించకుండా ఆయన జాగ్రత్త పడ్డారని, ఆ మేరకు పార్టీ నాయకులకు ఆదేశాలు ఇచ్చారని అంటున్నారు.