జెఏసి, టిఆర్ఎస్: పావులు కదుపుతున్న కాంగ్రెస్
తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయడంతో పాటు తెలంగాణలో గట్టిగా నిలదొక్కుకునే ప్రయత్నాలను కూడా అధికార కాంగ్రెసు పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ విభజనకే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే విభజన ద్వారా సీమాంధ్రలో కొంతమేర నష్టపోవాల్సి ఉంటుంది. తెలంగాణలో మాత్రం క్లీన్ స్వీప్ చేసే వ్యూహాలకు సిద్ధమైందట. అందులో భాగంగా తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తోందట.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి, ఆ క్రెడిట్ తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలకు పోకుండా అధిష్టానం పావులు కదుపుతోందంటున్నారు. తెలంగాణ ఇచ్చి జెఏసితో దోస్తీ కట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తోందంటున్నారు. అవసరమైతే తెరాసను విలీనం చేసుకునే ఆలోచనలు కూడా చేస్తోందట. తెలంగాణపై ప్రకటన వస్తే.. అంటూ కాంగ్రెసు, టిఆర్ఎస్ నేతలు గురువారం పలు రకాలుగా స్పందించారు.
ఢిల్లీలో జెఏసి నేతలకు కాంగ్రెసు సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి విందు ఇచ్చారు. కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ విలీనం తథ్యమన్నారు. కెసిఆర్ అధిష్టానానికి దగ్గరి వాడని, తమతో కలిస్తే సంతోషిస్తానని మాజీ పిసిసి చీఫ్ డి శ్రీనివాస్ అన్నారు. పంచాయతీ ఎన్నికలలోపు తెలంగాణ ప్రకటిస్తే కాంగ్రెసుకు మద్దతివ్వాలని ప్రజలను కోరుతామని తెరాస ఎమ్మెల్యే కెటిఆర్ చెప్పారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలవి డ్రామాలుగా అనుకోవడంలేదని హరీశ్ రావు పేర్కొన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీకే లాభమని పెద్దపల్లి ఎంపి వివేక్ పేర్కొన్నారు. నేతల వ్యాఖ్యలను చూస్తున్నా అధిష్టానం జెఏసిని మచ్చిక చేసుకోవడం, తెరాసను విలీనం చేసుకోవడంపై దృష్టి సారిస్తున్నట్లుగా కనిపిస్తోందంటున్నారు. అప్పుడే తమకు రాజకీయంగా బాగా లబ్ధి చేకూరుతుందని భావిస్తోందని భావిస్తోందట.












Click it and Unblock the Notifications