జగన్ కొత్త ప్లాన్: బాబుకు కౌంటర్, కాంగ్రెస్కు షాక్
ఇటీవల థర్డ్ ఫ్రంట్తో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ అంశాల పైన కూడా చంద్రబాబు ఆయా పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో బాబుకు ధీటుగా జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టి చక్రం తిప్పాలని జగన్ పార్టీ భావిస్తోందట. రాజకీయంగా మాత్రమే కాకుండా కేసుల విషయంలోను ఇదే పంథాను కొనసాగించేందుకు సిద్ధమవుతోందని సమాచారం.
వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ కేసు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిబిఐ కేసులను ఎదుర్కొంటున్న పలు పార్టీల నేతలతో, యూపిఏ మిత్రపక్షాల్లో అలాంటి కేసులను ఎదుర్కొంటున్న వారితో మాట్లాడేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సన్నద్ధమవుతోందట. సిబిఐని అడ్డం పెట్టుకొని తన ప్రత్యర్థులను కాంగ్రెసు బ్లాక్ మెయిల్ చేస్తోందని ఢిల్లీలో చర్చ తీసుకురావడం ద్వారా జాతీయ స్థాయిలో సానుభూతి పొందవచ్చునని ఆ పార్టీ భావిస్తోందని అంటున్నారు.
జగన్కు బెయిల్ రాకపోవడం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కొంత ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో వివిధ పార్టీలతో చర్చలు జరపడం జగన్కు, రాజకీయంగా పార్టీకి ఏ మేరకు లాభమనే అంశంపై పార్టీలో చర్చ సాగుతున్నట్లుగా సమాచారం. పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... సిబిఐ ద్వారా దేశవ్యాప్తంగా కాంగ్రెసు వేధింపులకు గురవుతున్న వారందర్నీ ఏకం చేయాలని చర్చకు వచ్చినట్లు చెప్పారు.
జాతీయ స్థాయిలో చర్చకు తేవడం ద్వారా అటు యూపిఏ విపక్షాలపై, తమకు మద్దతివ్వని వారిని వారని కేసులతో బ్లాక్ మెయిల్ చేస్తోందని చెప్పడమే కాకుండా... తెలుగుదేశం పార్టీకి ధీటుగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకం అయ్యేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.