తెలంగాణ తేల్చారా?: ప్రకటనపై తర్జన భర్జన
అధిష్టానం, కేంద్రం రాష్ట్ర విభజనపై ఓ స్పష్టతకు వచ్చిందంటున్నారు. హైదరాబాదును యూటిగా రాష్ట్ర విభజన, రాష్ట్రాన్ని అలాగే ఉంచి తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ తదితర అంశాలపై అధిష్టానం తీవ్ర తర్జన భర్జన పడిందంటున్నారు. అధిష్టానం అంతిమంగా ఓ నిర్ణయానికి వచ్చినప్పటికీ ఏమిటనే అంశంపై ఎవరికీ అంతుపట్టకుండా ఉందంటున్నారు. ఓ నిర్ణయానికి వచ్చిన అధిష్టానం నిర్ణయాన్ని ఎలా అమలు చేయాలి? ఏం చేస్తే ఏమవుతుంది? వాటిని ఎలా ఎదుర్కోవాలి? అనే అంశాలపై అధిష్టానం తర్జన భర్జన పడుతోందట.
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్ తరఫున ఇప్పటికే ఇద్దరు మధ్యవర్తులను తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వద్దకు పంపినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను విశ్వాసంలోకి తీసుకోవాలని కూడా అధిష్ఠానం నిర్ణయించిందట.
వివిధ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఉభయ ప్రాంతాల్లో ఎమ్మెల్యేల నేపథ్యంపై ఆరా తీస్తున్నారట. తెలంగాణపై కేంద్రం ఏ నిర్ణయం ప్రకటిస్తుందన్న అంశంపై పార్టీ సీనియర్ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలోని 5వ సిఫారసులో చెప్పినట్లు నేరుగా హైదరాబాద్ రాజధానిగా తెలంగాణను ప్రకటించే అవకాశాలున్నాయని కొందరు అంటున్నారు. అదే సమయంలో, హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే విషయంపై ఇంకా తర్జనభర్జనలు జరుగుతున్నాయని, మారిస్తే ఎంత కాలం ఈ హోదా కొనసాగుతుందో కూడా నిర్దిష్టంగా ప్రకటించవచ్చునని అభిప్రాయపడుతున్నారు.
నిర్ణయంలో భాగంగా సీమాంధ్రకు ప్రత్యేక రాజధానిని నిర్మించేందుకు భారీ ఎత్తున ప్యాకేజీని ప్రకటిస్తారని కూడా ఆయన విశ్లేషించారు. అయితే, తెలంగాణకు ప్యాకేజీని ప్రకటించే అంశంపైనా అధిష్ఠానం చర్చలు జరుపుతోందంటున్నారు. ప్యాకేజీలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రత్యేక మండలి ఉండవచ్చునని కూడా అంటున్నారు.
కానీ, తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం వల్లనే రాజకీయంగా కాంగ్రెస్కు ప్రయోజనం కలుగుతుందని, రాష్ట్రాన్ని విభజించి రెండు ప్రాంతాల్లో ముఖ్యమంత్రులను నియమిస్తే ఏడాదిలోగా పరిస్థితి కుదుటపడుతుందని అధిష్టానానికి కొందరు సూచిస్తుండగా.. విభజన వద్దని పరిస్థితి కుదురుకుంటుందని మరికొందరు నివేదికలు ఇస్తున్నారట.