కాలేజీలకు టీ సర్కారు షాక్: లక్ష సీట్లకు గండి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు ఇంజినీరింగ్ కళాశాలలకు గట్టి షాక్ ఇచ్చింది. ఆషామాషీ కాలేజీల పైన కొరడా ఝులిపించింది. 174 ఇంజినీరింగ్, 85 పార్మసీ కాలేజీల పైన ప్రభుత్వం కన్నెర్రజేసింది. దీంతో ఇంజినీరింగ్లో లక్ష సీట్లకు గండిపడింది. ఇది తెలంగాణ సర్కార్ తీసుకున్న మరో సంచలన నిర్ణయం.
తెలంగాణవ్యాప్తంగా 315 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వీటిలో 174 కాలేజీలను రద్దు చేసింది. ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న 1,84,575 ఇంజనీరింగ్ సీట్లలో సుమారు లక్ష సీట్లకు కోతపెట్టింది. ఈ ఏడాది తెలంగాణలో 141 కాలేజీల్లో, 85,455 ఇంజనీరింగ్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఫార్మసీ కాలేజీలు, సీట్ల విషయంలోనూ సర్కారుది ఇదే పంథా కొనసాగించింది.
వృత్తి విద్యా కాలేజీల గుర్తింపు (అఫిలియేషన్) విషయంలో పూర్తి కచ్చితత్వంతో వ్యవహరించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించడంతో వాటికి షాకిచ్చింది. ఏఐసీటీఈ నిబంధనలను పాటించని, విద్యా ప్రమాణాలను కాపాడని, ఆషామాషీగా, కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ కోసమే నడుస్తున్న వృత్తి విద్యా కాలేజీలు అవసరం లేదని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో (ఓయూ రీజియన్) మొత్తం 315 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. వీటిలో 141 కాలేజీలకే జేఎన్టీయూహెచ్, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు అఫిలియేషన్ ఇచ్చాయి. అంటే మిగిలిన 174 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదన్నమాట. ఓయూ రీజియన్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం 1,84,575 సీట్లు ఉండగా, ఇప్పుడు వాటిల్లో 85,455 సీట్లకు వర్సిటీలు గ్రీన్సిగ్నల్ ఇచ్చాయి. ఇక్కడ 99,120 సీట్లను కట్ చేశాయి.
ఫార్మసీ కాలేజీలు, సీట్లలోనూ భారీగా కోత పెట్టింది. ఓయూ రీజియన్లో 146 ఫార్మసీ కాలేజీలు ఉండగా, 61 కాలేజీలకు మాత్రమే అఫిలియేషన్ ఇచ్చాయి. మిగిలిన 85 కాలేజీలకు ఇవ్వలేదు. అలాగే 18,564 ఫార్మసీ సీట్లు ఉండగా, 10,910 సీట్లను తొలగించాయి. ఈ సమాచారాన్నంతా జాగ్రత్తగా పరిశీలించిన ప్రభుత్వం.. తదానుగుణమైన చర్యలను ప్రారంభించింది.
అందులో భాగంగా విశ్వవిద్యాలయాలు అఫిలియేషన్ ఇచ్చిన ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలను మాత్రమే వెబ్లో నిక్షిప్తం చేశారు. ఆదివారం నుంచి వెబ్ ఆప్షన్ల పర్వం మొదలు కానున్నందున, ఫస్ట్ ఫేజ్లో ఈ కాలేజీలకు మాత్రమే అభ్యర్థులు ఆప్షన్ నమోదు చేసుకునే వీలుంది.
మిగిలిన కాలేజీలకు ఆయా విశ్వవిద్యాలయాలు అఫిలియేషన్ రెన్యువల్ ఇవ్వవా లేక లోపాలపై కాలేజీల నుంచి అండర్టేకింగ్ తీసుకుంటారా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. శనివారం విశ్వవిద్యాలయాలు అఫిలియేషన్పై నిర్ణయం తీసుకున్న విషయం తెలియగానే, తెలంగాణ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్య సంఘం ప్రతినిధులు విస్మయానికి గురయ్యారు. అధికారులను కలిసి తమ ఆందోళనను తెలియజేసే ప్రయత్నాలు చేశారు. న్యాయపోరాటం చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేయవచ్చు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని కాలేజీలకు, సీట్లకు అనుమతి లభించింది. వాటిని వెబ్లో పెట్టారు. ఆంధ్రా వర్సిటీ రీజియన్లోని 212 ఇంజినీరింగ్ కాలేజీలలో 206 కాలేజీలకు అఫిలియేషన్ లభించింది. వాటన్నింటినీ వెబ్లో పెట్టారు. అలాగే 85 ఫార్మసీ కాలేజీల్లో 75 కాలేజీలకు వర్సిటీలు అఫిలియేషన్ ఇచ్చాయి. ఇంజనీరింగ్లో 1,16,790 సీట్లకుగాను 1,13,640 సీట్లను , ఫార్మసీలో 9,030 సీట్లకుగాను 7,490 సీట్లకు గ్రీన్సిగ్నల్ ఇచ్చాయి.
ఎస్వీయూ రీజియన్లో .. 118 ఇంజనీరింగ్ కాలేజీలలో 113 కాలేజీలకు, 61,620 సీట్లలో 54,869 సీట్లకు అనుమతి లభించింది. 37 ఫార్మసీ కాలేజీలలో 36 కాలేజీలకు, 3,840 సీట్లలో 3,120 సీట్లకు పచ్చజెండా ఊపాయి. రెండు రాష్ట్రాలలో కలిపి వర్సిటీల్లో 7,184 ఇంజినీరింగ్ సీట్లు, 600 ఫార్మసీ సీట్లకు అనుమతి లభించింది.