4 సిటీల్లో 35: ఏపీ ఎన్టీఆర్ క్యాంటీన్లలో మెనూ...
హైదరాబాద్: ఎన్టీఆర్ క్యాంటీన్లు (అన్న క్యాంటీన్లు) ప్రారంభించి పేదలు, కార్మికులకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చోస్తోంది. ఈ విషయమై రాష్ట్ర మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీతలు ఆదివారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఒక్కో పదార్థం ధర ఎంత పెట్టాలి? ఒక్కో వ్యక్తి మీద ఎంత సబ్సిడీ భరించాల్సి ఉంటుంది? తొలుత ఎక్కడ ప్రారంభించాలి? నిర్వహణ ఎవరికి? తదితర అంశాలపై చర్చించారు.
ఈ క్యాంటీన్ల కోసం ఏటా 160 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పేదలకు చౌకగా భోజనం అందించేందుకు ఎన్టిఆర్ క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఉప సంఘంలో సునీత, నారాయణ, పుల్లారావు తదితరులు ఉన్నారు. ఇప్పటికే ఈ ఉపసంఘం సభ్యులు ఒక పర్యాయం తమిళనాడు రాష్ట్రానికి వెళ్లి వచ్చింది.
మరోసారి తమిళనాడు వెళ్లి అక్కడ ఈ తరహా క్యాంటీన్ల నిర్వహణ ఏ విధంగా ఉందో అధ్యయనం చేయనుంది. మొదటి దశలో అనంతపురం, తిరుపతి, గుంటూరు, విశాఖపట్నంలలో 35 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దశలవారీగా రాష్ట్రం మొత్తంలో ఈ తరహా క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పౌరసరఫరాల శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
అనంతరం మంత్రులు విలేకరులతో మాట్లాడారు. అల్పాహారం ఇడ్లీ, ఉప్మా, పొంగల్, మధ్యాహ్న భోజనంలో సాంబారు అన్నం, పులిహోర, పెరుగన్నం, రాత్రి భోజనంగా రెండు చపాతీలు, శాఖాహార కూర అందించాలని భావిస్తున్నట్లు చెప్పారు. అల్పాహారం రూ.5ల లోపు, సాంబారు అన్నం రూ.7.50, పెరుగన్నం రూ.6.50, రెండు చపాతీలు, కూర కలిపి రూ.7.50కు అందించాలని భావిస్తున్నట్లు చెప్పారు.
మధ్యాహ్న భోజనం కింద సాంబారు అన్నం, పెరుగన్నం, పులిహోర.. ఈ మూడింటినీ అందుబాటులో ఉంచుతామన్నారు. ఒక మనిషికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆహారం అందించేందుకు రూ.40 సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ క్యాంటీన్ల నిర్వహణను స్వయం సహాయక సంఘాలు, స్వచ్చంధ సంస్థలకు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ విషయాలను అన్నింటిని సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామన్నారు.