జయలలిత అంతే: బయటకి కన్పించరు, తొణకలేదు
చెన్నై: అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఊరట లభిస్తుందా, లేదా అనే విషయమై లక్షలాదిమంది అభిమానులతో పాటు, దేశం యావత్తు ఆసక్తికరంగా చూసింది. అయితే, జయలలిత మాత్రం ఎలాంటి ఉత్కంఠ లేకుండా ప్రశాంతంగా ఉన్నట్లు తెలుస్తోంది.
గత ఏడాది సెప్టెంబర్ 18న పరప్పన అగ్రహారం సెంట్రల్ జైలు నుంచి పొయెస్ గార్డెన్కు వచ్చిన జయలలితి ఇప్పటి వరకూ బయటకు రాలేదు. తీర్పు గురించి విన్నప్పుడు కూడా ఆమె గుంభనంగా కనిపించారే తప్ప ఎలాంటి భావాలు వ్యక్తం చేయలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం పన్నీర్ సెల్వం, మంత్రులకు జయ చిరునవ్వుతోనే కనిపించారు.
సాధారణంగా జయలలిత అంతరంగం ఎవరికీ అర్థం కాదు. తమిళనాట మాత్రమే కాకుండా దేశ రాజకీయాల్లోనే ఆమె భిన్నమైన నేత. ఆమె ఏం చేసినా చర్చనీయాంశమవుతుంది. సాధారణంగా రాజకీయాల్లో పదవులు వదులుకునేందుకు, అదీ అధినేత చెప్పినా సిద్ధంగా ఉండరు. కానీ జయలలిత కోసం మాత్రం పదవులు వదులుకునేందుకు క్యూ కడతారు. అభిమానులు, నేతలు ఆమె పాదాల వద్ద మోకరిల్లుతారు.
అక్రమాస్తుల కేసు విషయానికి వస్తే... 18 సంవత్సరాల పాటు 14 రకాల కేసులు మెడకు చుట్టుకున్నాయి. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. జైలుకెళ్లారు. అయినప్పటికీ జయలలితలో ఏమాత్రం బెణుకు కనిపించలేదు. మనోనిబ్బరం ఆమె సొంతం.
టాన్సీ భూములు, ఆదాయానికి మించి ఆస్తుల కేసుల కేసులు ఆమెను తిప్పలు పెట్టాయి. ఈ కేసుల్లో కింది కోర్టులు ఇచ్చిన తీర్పుతో ఆమె ముఖ్యమంత్రి పదవి కోల్పోయారు. చూడటానికి రాజకీయంగా సంచలనాత్మకంగా కనిపించినా మానసికంగా ఆమెకు ఎంతో కష్టకాలం. అయితే, జయ తన భావాలను ఎక్కడా బయటకు రానీయకుండా గుంభనంగా వ్యవహరించారు.
తొమ్మిది నెలల క్రితం ప్రత్యేక న్యాయస్థానం జయలలితను దోషిగా ప్రకటించింది. అప్పటి నుండి జయ మౌనం వహించారు. సీఎం పదవి పోయింది. పోయెస్ గార్డెన్ నుండి బయటకు రాలేదు. ఒకటిరెండుసార్లు ప్రకటనలు చేసినా తీర్పు పైన, రాజకీయాల పైన వ్యాఖ్యలు చేయలేదు. కార్యకర్తలకు విజ్ఞప్తి మాత్రమే చేశారు. కాగా, జయలలితను కోర్టు నిర్దోషిగా ప్రకటించిన నేపథ్యంలో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.