అనుష్క ఎఫెక్ట్: కోహ్లీ ఐతే ఆటకంటే ఎక్కువనా, చర్యలే
ముంబై: ఆట కంటే ఏ ఆటగాడూ ఎక్కువ కాదని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అన్నాడు. ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా నిబంధనల్ని అతిక్రమించి ప్రేయసి అనుష్క శర్మను కలిసిన కోహ్లిని బీసీసీఐ మందలించిన నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి ఠాకూర్ పై వ్యాఖ్యలు చేశాడు.
ఈ వ్యవహారంలో ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకుంటామని, ఆటకు సంబంధించి ఎవరైనా నిబంధనలు పాటించాల్సిందేనని, ఆట కంటే ఏ ఆటగాడూ మిన్న కాదని చెప్పాడు.
భారత క్రికెట్ జట్టు కోచ్ పైన మాట్లాడుతూ... ఎంపిక ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని చెప్పాడు. అర్హులైన వారితో షార్ట్ లిస్టడ్ తయారు చేస్తున్నట్లు చెప్పాడు. అయితే ఫలానా తేదీలోగా అనేది ఇప్పుడే చెప్పలేమని తెలిపాడు.
కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కాస్త సమయం పట్టడం సహజమన్నాడు. కోచ్ ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంటుందన్నాడు. సమర్థుడైన, రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు అందించగల కోచ్ రావడం మాత్రం ఖాయమని చెప్పాడు. మాజీ క్రికెటర్ల సేవలు వినియోగించుకుంటామన్నాడు.