ఏపీలో ఆకాశహర్మ్యాల్లో పేదలు: చంద్రబాబు ప్లాన్
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతితోపాటు ఏపీలో పేదల ప్రజల కోసం ఆకాశహర్మ్యాలు రానున్నాయి. అత్యాధునిక సౌకర్యాలు, ఆధునిక శైలిలో గృహ నిర్మాణాలు చేపట్టాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ప్రయివేటు నిర్మాణ సంస్థలు ముందుకు రావాలని సూచించారు.
సామాన్యులు సైతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అ్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టే గృహ నిర్మాణం మురికివాడలను ప్రోత్సహించేదిగా కాకుండా ఆర్థిక లావాదేవీలు పెంచేందుకు దోహదపడేలా ఉంటుందన్నారు.
సోమవారం సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రతినిధులతో ఆయన విజయవాడలోని విడిది కార్యాలయంలో భేటీ అయ్యారు. నవ్యాంధ్ర నిర్మాణాన్ని చంద్రబాబు భుజానికి ఎత్తుకున్నారని సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రతినిధులు ప్రశంసించారు.
ఆయనను స్ఫూర్తిగా తీసుకొని తాము పేదలకు అందుబాటులో ఉండే గృహ నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు వచ్చామని చెప్పారు. తమకు నాలుగు రాష్ట్రాల్లో లక్షల ప్లాట్లు నిర్మించిన అనుభవం ఉందని చెప్పారు. నవ్యాంధ్రలో పేదలకు సకల సదుపాయాలతో ఇళ్లను నిర్మిస్తామన్నారు.
కాగా, ఏపీ రాజధాని అమరావతిని సియోల్, యూకేల స్ఫూర్తిగా హౌస్ మీడియా హబ్గా మార్చాలని చంద్రబాబు భావిస్తున్నారు. అమరావతిలో... ప్రభుత్వ సిటీ, జస్టిస్ సిటీ, నాలెడ్జ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, టూరిజం సిటీలతో పాటు మీడియా-కల్చరల్ సిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. అమరావతిలో మొత్తం 9 'సిటీ'లు ఏర్పాటు చేయనున్నారు.