మోడీ ఫిక్స్: కెసిఆర్, చంద్రబాబు పోటీ
హైదరాబాద్: గోదావరి పుష్కరాలకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోటీ పడుతున్నారు. ఎటు రావాలనే విషయంపై మోడీ ఫిక్స్లో పడే అవకాశం ఉంది. గోదావరి పుష్కరాలను ప్రారంభించడానికి రావాల్సిందిగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను వారు కోరుతున్నారు. జులై 14వ తేదీన గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. గోదావరి పుష్కరాలకు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి ప్రముఖ స్థలంగా కొనసాగుతూ వచ్చింది. అయితే, ఈసారి గోదావరి పుష్కరాలను పెద్దయెత్తున నిర్వహించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. మోడీ ఈ పుష్కరాల ప్రారంభానికి వస్తారని తెలంగాణ ప్రభుత్వానికి గానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గానీ ప్రధాని కార్యాలయం ఇప్పటి వరకు హామీ ఇవ్వలేదు.
రాజమండ్రి గోదావరి పుష్కరాలకు మొదటి నుంచి ప్రఖ్యాతి వహించింది కాబట్టి ఇక్కడికే ప్రధాని రావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటుండగా, గోదావరి నది తెలంగాణ నుంచే ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుందని, పైగా ఈ నది ఎక్కువగా తెలంగాణలోనే ప్రవహిస్తుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. గోదావరి పుష్కరాలను ప్రారంభించడానికి రావాల్సిందిగా ప్రధానిని, రాష్ట్రపతి కోరామని తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అంటున్నారు. ప్రధాని రెండు చోట్లకు ఒకేసారి రావడం కుదరదు కాబట్టి 12 రోజుల పుష్కరాల కాలంలో ఏదో ఒక రోజు రావచ్చునని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి నది రెండు జిల్లాల్లో 130 కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తుందని, తెలంగాణలో 480 కిలోమీటర్లు ప్రవహిస్తుందని అంటున్నారు. గోదావరి పుష్కరాల కోసం 110 ఘాట్లను నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం రూ.500 కోట్ల విలువ చేసే టెండర్లను ఆహ్వానించింది. తెలంగాణలోని పుష్కరాలకు ఈసారి 5.5 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. నిరుడు 3 కోట్ల మంది వచ్చారు. కాగా, కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు 100 కోట్ల రూపాయలేసి విడుదల చేయగా, తెలంగాణకు 50 కోట్ల రూపాయం మాత్రమే విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానిని నోటి మాటగా ఆహ్వానించింది. అధికారికంగా ఆహ్వానించడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రధాని తమ రాష్ట్రంలోని గోదావరి పుష్కరాల ప్రారంభ కార్యక్రమానికే వస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోంది.












Click it and Unblock the Notifications