ఓటుకు నోటు: బాబు వర్సెస్ కేసీఆర్, మధ్యలో జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య లేదా ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గొడవలు కనిపిస్తున్నాయి. రాష్ట్రం వచ్చి ఏడాది అయినందున తెలంగాణ ప్రజలు ఉప్పొంగిపోయి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. ఏపీలో మాత్రం భావోద్వేగం కనిపించింది.
విభజనతో ఇరు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలి. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుల పోరు దానిని మరో లెవెల్కు తీసుకు వెళ్లింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేలను టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసేందుకు యత్నించారని తెరాస ఆరోపిస్తోంది.
దీనికి టీడీపీ కూడా ఘాటుగానే సమాధానం చెబుతోంది. తమకు 20 మంది ఎమ్మెల్యేల (5 బీజేపీ మద్దతు) ఉన్నప్పుడు తాము ఎందుకు కొంటామని, ఒక ఎమ్మెల్సీ సీటు గెలిచేందుకు 17 మంది ఎమ్మెల్యేల ఓటు చాలని టీడీపీ చెబుతోంది.
అదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరింత చర్చకు దారి తీసింది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఏపీ కీలక అధికారుల ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఏపీ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఏపీకి చెందిన 120 ఫోన్లను ట్యాపింగ్ చేసిందని ఏపీ హోంమంత్రి చినరాజప్ప ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పైన ఏపీలో దాదాపు 80 పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు, కేసులు పెట్టారు. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం ఫోన్ ట్యాపింగ్ జరిగితే మొదట ఎఫ్ఐఆర్ తప్పనిసరి.
ఏపీ ప్రభుత్వం పైన, చంద్రబాబుపైన, టీడీపీ పైన తెరాస ప్రభుత్వంతో కలిసి వైసీపీ అధినేత జగన్ కుట్ర చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీని అణగదొక్కేందుకు జగన్ టీఆర్ఎస్ మధ్యవర్తిగా ఢిల్లీలో తిరుగుతున్నారని టీడీపీ విమర్శిస్తోంది.
చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ తెరాసతో కలిసి కుట్ర చేస్తున్నారని ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. జగన్ తెలంగాణ ప్రభుత్వం తరఫున ఉన్నారని మండిపడుతున్నారు.
మరోవైపు, తెరాస.. చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ చేస్తోంది. ఆడియో టేప్ విషయంలో చంద్రబాబు ఖండించడం లేదా సమర్థించడం చేయడం లేదని చెప్పారు. చంద్రబాబు చట్టాని కంటే పెద్దవాడు కాదంటున్నారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేనే డబ్బులు ఇస్తూ పట్టుబట్టారని అంటున్నారు. మరోవైపు, విపక్షాలు.. రేవంత్ దొరికిన దొంగ అని, కేసీఆర్ దొరకని దొంగ అని ధ్వజమెత్తుతున్నారు.