సాగర్పై బాబు ఆక్రమణ కుట్ర: టికి రావొచ్చన్న హరీషా
హైదరాబాద్: నాగార్జున సాగర్ 13 గేట్ల నిర్వహణ బాద్యతలను తమకే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం లేఖ రాయటం పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు గురువారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పలు అంశాలపై గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు నాగార్జున సాగర్ నిర్వహణ పైన కూడా ఇరు రాష్ట్రాల మధ్య మంటలు రాజుకున్నాయి.
సాగర్ 13 గేట్ల నిర్వహణ బాధ్యత తమకే ఇవ్వాలని ఏపీ లేఖ రాయడం సరికాదని హరీష్ రావు అన్నారు. సంగారెడ్డిలో ఆయన శుక్రవారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. విభజన బిల్లు ప్రకారం నాగార్జున సాగర్ నిర్వహణ తెలంగాణ ప్రభుత్వానికి, శ్రీశైలం నిర్వహణ ఏపీకి కేటాయించారన్నారు. ఈ బిల్లును తుంగలో తొక్కి సీమాంధ్ర పాలకులు తమ ఇష్టారీతిగా జలదోపిడీకి ప్రయత్నిస్తున్నారన్నారు. నీటి విడుదల వంటి కీలక నిర్ణయాలు కృష్ణా బోర్డు చేస్తుందన్నారు.
శుక్రవారం కూడా సాగర్ కుడికాల్వ నుండి మూడవేల క్యూసెక్కులు, పవర్ హౌస్ ద్వారా ఐదువేల క్యూసెక్కులు ఏపీకే వదిలారన్నారు. మన నీళ్లను సైతం దోచుకోవాలనే దురాశ వారిదని, ఇది అన్యాయమన్నారు. ఏపీ సర్కారు లేఖ రాయడం దుర్మార్గమైన చర్య అని, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఐదు రోజులకే తెలంగాణ వ్యతిరేక చర్యలు ప్రారంభించారన్నారు.
ఏపీ ఇలాగే వ్యవహరిస్తే జూరాల నుండి ఒక్క చుక్క నీటిని కూడా వదిలేది ఉండదన్నారు. చంద్రబాబు తెలంగాణలో పర్యటించడం పైన తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ తెలంగాణకు రోజుకో అన్యాయం చేస్తూ, కేంద్రానికి తప్పుడు లేఖలు రాస్తున్న వ్యక్తి ఏ ముఖం పెట్టుకొని పర్యటిస్తారని ప్రశ్నించారు.
గత అరవై ఏళ్లుగా తమ ఇష్టానుసారం నీళ్లను దారి మళ్లించేందుకు అలవాటు పడిన నాయకులు ఇప్పుడ ఆ అవకాశం లేకుండాపోతోందని భావిస్తున్నారని, అందుకే కొత్త కుట్రకు తెరలేపారన్నారు. బచావత్ ట్రైబ్యునల్ తెలిపిన మేరకే తెలంగాణ ప్రభుత్వం నీటని వినియోగించుకుంటోందని, అంతకుమించి తమకు ఒక్క చుక్క నీరు కూడా ఎక్కువ వద్దన్నారు. కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారిస్తుంటే కాంగ్రెస్, టీడీపీ నేతలకు భవిష్యత్తు బెంగ పట్టుకుందన్నారు.