ఎపి రాజధాని: సింగపూర్కు సైతం వాస్తు విశ్వాసమా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి వాస్తు బాగుందని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. సింగపూర్కు కూడా వాస్తు విశ్వాసాలు ఉన్నాయా అనే చర్చ ప్రారంభమైంది. టీవీ చానెళ్లలో మంగళవారం ఉదయం దానిపైనే చర్చ సాగింది. రాజధాని అమరావతి వాస్తు బాగుందని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ చెప్పారు. ఏపీ ప్రభుత్వం, అధికారుల సహకారం వల్లే ఎంతో సంక్లిష్టమైన రాజధాని నగర నిర్మాణ బృహత్ ప్రణాళికను ఇంత త్వరగా రూపొందించగలిగామని ఈశ్వరన్ అన్నారు.
రాజధాని నగర బృహత్ ప్రణాళికను సీఎం చంద్రబాబుకు అందించిన తర్వాత ప్రణాళిక సమగ్ర స్వరూపాన్ని ఆయన వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి మీడియాతో మాట్లాడారు. రాజధాని నగర బృహత్ ప్రణాళిక బ్లూప్రింట్ వంటిదని ఆచరణలోకి వస్తే ఎందో బాగుంటుందని ఈశ్వరన్ అన్నారు.
కాగా, వాస్తవానికి, ప్రపంచస్థాయి రాజధాని మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి చాలా సమయం పడుతుందని, కానీ రాజధాని నగర నిర్మాణంలో పూర్తి సహకారం అందిస్తామని సింగపూర్ ప్రభుత్వం ముందుకు వచ్చిందని చంద్రబాబు అన్నారు. ఇందుకు విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకుందని, వ్యక్తిగతంగా తనకు, తెలుగు దేశం పార్టీకి, ప్రభుత్వానికి ఉన్న విశ్వసనీయత కారణంగానే మాస్టర్ ప్లాన్ను ఉచితంగా డిజైన్ చేసేందుకు సింగపూర్ అంగీకరించిందని వివరించారు.
ఫలానా ఏడాది నాటికి రాజధాని నగరం పూర్తవుతుందంటూ తాను ఇప్పుడే తేదీలను వెల్లడించలేనని చంద్రబాబు చెప్పారు. పారదర్శకంగా రాజధాని నగర నిర్మాణం జరుగుతుందని, స్విస్ చాలెంజ్ విధానంలో, పోటీతత్వంతో కూడిన టెండర్ విధానంలో పనులు అప్పగిస్తామని చెప్పారు. రాజధానిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రాజధానిని నిర్మించేందుకు ప్రయత్నిస్తామని, రాజధాని నిర్మాణమనేది ఒక్కసారే జరుగుతుందని, అందుకే భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర రాజధాని త్రిభుజాకారంలో ఉంటుంది. కృష్ణా నదీ తీరంలో ఇది రూపుదిద్దుకుంటోంది. మూడు దశల్లో రాజధాని నిర్మాణం పూర్తవుతోందని ఈశ్వరన్ చెప్పారు.