ఏపీకి అడిగనన్ని నిధులు, తెలంగాణకి భూమివ్వలేదు
హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ఏపీ లోటు బడ్జెట్లో ఉంది. అప్పులు తెచ్చి నడిపిస్తున్నారు. ఆ అప్పులు తీర్చేందుకు కనీసం ఇప్పటికిప్పుడు రూ.5వేల కోట్లు అవసరమని, వాటిని ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి మొర పెట్టుకుంది.
కాగా, రెవెన్యూ లోటు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రత్యేక ప్యాకేజీ, సీఎస్టీ బకాయిలకు సంబంధించి 24,500 కోట్లు ఇవ్వాల్సిందిగా గత ఏడాది కేంద్రాన్ని కోరింది. అయితే, అందులో రూ.350 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
అయితే, ఈసారి అడిగిన రూ.5వేల కోట్లు అయినా విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. గత ప్యాకేజీ విషయంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు.
ఏపీ రెవెన్యూ లోటు రూ.17వేల కోట్లు ఉంటుందని కాగ్ అంచనా వేసింది. పుష్కరాల అనంతరం కేంద్రం పైన నిధుల కోసం ఒత్తిడి తేవాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది.
మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం... దామెరచర్ల విద్యుత్ కేంద్రాలకు భూకేటాయింపులు అడిగినంత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. నల్గొండ జిల్లా దామెరచర్లలో కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి తెలంగాణ సర్కారు అడిగిన అటవీ స్థలంలో సగం కూడా కేంద్రం ఇవ్వలేదు.
మొత్తం 4,434.01 హెక్టార్ల అటవీ భూములను కేటాయించాలని ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కానీ 1,892.35 హెక్టార్ల భూమినే కేటాయిస్తూ కేంద్ర అటవీ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
దామెరచర్ల మండలంలోని వీర్లపాలెంలో 4400 మెగావాట్లు, దిలావల్ పూర్లో 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి ఈ భూములు కేటాయిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
విద్యుత్ కేంద్రాలకు తప్ప మరే ఇతర అవసరాలకు వీటిని మళ్లించరాదని, ఒకవేళ ఇతర అవసరాలకు వాడుకోవాలనుకుంటే తప్పనిసరిగా మళ్లీ తమ అనుమతి తీసుకోవాలని కేంద్ర అటవీశాఖ స్పష్టం చేసింది. ప్రజల నివాసాలు ఈ భూముల్లో నిర్మించవద్దని, అలాగే, విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి చెట్లు నరికేయవలసి వస్తుంది కాబట్టి ఆ మేరకు సమీప ప్రాంతాల్లో పక్షుల నివాసాలకు కృత్రిమ పక్షిగూళ్లను నిర్మించాలని సూచించింది.