ఎన్టీ రామారావు తర్వాతే అరవింద్ కేజ్రీవాల్
హైదరాబాద్: తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఓ సందర్భంలో రోడ్డు బైఠాయించి ఆందోళనకు దిగారు. ఆ తర్వాత సుమారు 25 ఏళ్ల అనంతరం దేశంలో అలాంటి ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్ మళ్లీ ఆయన బాటలోనే ఆందోళన చేపట్టడం గమనార్హం. ఈ ఆందోళన భాగంగా అరవింద్ కేజ్రివాల్ రోడ్డుపైనే నిద్రకు కూడా ఉపక్రమించాడు.
1988, నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్యాంక్బండ్పై ప్రముఖుల విగ్రహాలను ఆవిష్కరిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ ప్రాంతంలో మరిన్ని ఇరిగేషన్ సౌకర్యాలను కల్పించాలని కోరుతూ.. రాయలసీమ కాంగ్రెస్ నేతలు వైయస్ రాజశేఖర్ రెడ్డి, ఎంవి మైసూరారెడ్డి, జెసి దివాకర్ రెడ్డితోపాటు పలువురు నాయకులు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ను సచివాలయం వద్ద అడ్డుకున్నారు.
సచివాలయం గేట్లను మూసివేసి ఎన్టీఆర్ను ఘెరావ్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎన్టీఆర్ తన కారు నుంచి దిగి రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఒక్కసారిగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయనకు భద్రత కల్పించేందుక అతని చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. తన కండువాను రోడ్డుపై పరిచి దానిపై ఎన్టీఆర్ పడుకోవడంతో... ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆశ్చర్యానికి గురయ్యారు.
తనతో ఇక్కడే మాట్లాడాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎన్టీఆర్ సూచించారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సచివాలయంలోనే మాట్లాడతామని స్పష్టం చేశారు. నేను ఎక్కడ కూర్చుంటే అదే ముఖ్యమంత్రి కుర్చీ.. కాబట్టి ఇక్కడే మీ సమస్యను చెప్పండని అన్నారు ఎన్టీఆర్. ముఖ్యమంత్రిని అడుగుతున్నా.. మీ సమస్యను చెప్పండి అని ఎన్టీఆర్ వారితో అన్నారు. అయితే అందుకు నిరాకరించిన వారు.. ఎన్టీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్న ఎన్టీఆర్ సుమారు గంటపాటు రోడ్డుపైన బైఠాయించారు. ఆ రోజు అది ఒక సంచలనం సృష్టించింది.
కాగా ప్రస్తుతం తన ప్రభుత్వంలోని ఓ మంత్రి ఆదేశాన్ని పట్టించుకోని పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ, ఢిల్లీలోని పోలీసు విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ వీధి పోరాటానికి దిగి, రోడ్డుపైనే తన పార్టీ కార్యకర్తలతో ఆందోళనకు దిగారు. దీంతో భారీగా చేరుకున్న ఆప్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య పలుమార్లు తోపులాటలు, వాగ్వాదాలు చేస్తున్నాయి. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కేజ్రివాల్ తన ఆందోళనను విరమించారు.