హరి, బాలయ్య అసెంబ్లీకే: సీటు కోసం వెతుకులాట
తెలుగుదేశం పార్టీ నేత, ప్రముఖ హీరో హిందూపురం అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగాలని దాదాపు నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆయన సోదరుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ పోటీ చేసేందుకు మంచి సీటు కోసం తెలుగుదేశం పార్టీ అన్వేషణ ప్రారంభించిందట. బాలయ్య, హరికృష్ణలు ఇద్దరు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో దిగాలని భావిస్తున్నారు. వీరికి పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కూడా అంగీకారం తెలిపారని అంటున్నారు.
తద్వారా బావ, బావమరుదుల మధ్య సయోధ్య కుదిరిందంటున్నారు. కొద్దిరోజుల కిందట వీరిద్దరూ చంద్రబాబుతో విడివిడిగా సమావేశమయ్యారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తి తమకు ఉందని వారు చెప్పినప్పుడు చంద్రబాబు కూడా అంగీకరించారట. గతంలో హరికృష్ణఅ చేసిన వ్యాఖ్యలు, రాజ్యసభ సీటుకు ఆకస్మికంగా రాజీనామా చేయడం వంటివి పార్టీతో దూరం పెంచాయి. కొంత కాలంగా ఆయన పార్టీ పొలిట్బ్యూరో సమావేశాలకు కూడా రావడం లేదు.

కానీ, కొద్ది రోజుల కిందట జరిగిన పొలిట్బ్యూరో సమావేశానికి హాజరయ్యారు. అదేరోజు బాబుతో కూడా భేటీ అయ్యారు. ఈసారి ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తానని బాబుకు చెప్పారట. వీలైతే హిందూపురం సీటు ఇవ్వాలని ఆయన కోరారు. ఇక, ఉగాది రోజు చంద్రబాబు నివాసానికి భోజనానికి వచ్చిన బాలకృష్ణ కూడా ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. గతంలో పార్టీ వర్కింగ్ అధ్యక్ష పదవి కోసం పట్టుబట్టిన బాలయ్య ప్రస్తుతం అటువంటి ఆలోచనలేవీ పెట్టుకోలేదని అంటున్నారు.
బాలయ్య ఎన్నికల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై వారి మధ్య చర్చ జరిగింది. పోటీ చేస్తే తాను హిందూపురం అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తానని బాలకృష్ణ చెప్పారు. ఇందుకు చంద్రబాబు కూడా అంగీకరించినట్లు చెబుతున్నారు. హరికృష్ణ కూడా పోటీ చేస్తానని కోరుతుండటంతో ఆయన కోసం మరో మంచి సీటు కోసం అన్వేషణ జరుగుతోంది. అయితే, హరికృష్ణకు ఏ సీటు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications