టీవీ చానెళ్లపై బ్యాన్ వివాదం: తప్పుకున్న కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణలో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవి9 చానెళ్లపై నిషేధం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వ్యూహాత్మకంగా పక్కకు తప్పుకున్నారు. తనపై నిందలు వేసే పరిస్థితి లేకుండా ఆయన జాగ్రత్త పడ్డారు. ఆ రెండు చానెళ్లపై తీవ్రంగా మండిపడిన కెసిఆర్ తమ ప్రభుత్వానికి సంబంధం లేదంటూ పక్కకు తప్పుకున్నారు. టీవీ చానెళ్ల నిషేధంపై తమ ప్రభుత్వానికి సంబంధం లేదని తెలంగాణ మంత్రి కెటి రామారావు ఒక్కటికి రెండు సార్లు చెప్పారు. దాంతో ఎంఎస్వోలు ముందుకు వచ్చారు.
శుక్రవారం ఎంఎస్వోలు సమావేశమై టీవీ చానెళ్లపై నిషేధానికి బాధ్యత వహిస్తూ, అందుకు కారణాలు వివరిస్తూ సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రజల సంస్కృతిని కించపరిచేలా వ్యవహరించినందుకే టీవీ9, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలు నిలిపేశామని, ప్రభుత్వం సహా ఎవరి ఒత్తిళ్లు తమపై లేవని తెలంగాణ ఎంఎస్వోల సమాఖ్య (ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఎంఎస్వోస్) స్పష్టం చేసింది. తద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కెసిఆర్ను వివాదం నుంచి పక్కకు తప్పించింది.
ఈ స్థితిలో రెండు చానెళ్ల యాజమాన్యాలు వారితోనే వ్యవహారాలు నడపాల్సిన స్థితిలో పడ్డాయి. శుక్రవారం సమాఖ్య ప్రతినిధుల సమావేశం సికింద్రాబాదులో జరిగింది. వ్యవస్థాపక అధ్యక్షుడు కుల్దీప్ సహానీ, అధ్యక్షుడు ఎం సుభాష్ రెడ్డి, నేతలు కె. సమ్మయ్య, భాస్కర్ ఏచూరి, టీవీ సూర్యం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రసారాలను నిలిపేయడంతో పాటు టీవీ చానెళ్ల ముందు మరిన్ని డిమాండ్లు పెట్టారు. తెలంగాణలో ఉన్న మీడియా సంస్థలు స్థానిక జర్నలిస్టులకే అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశఆరు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న దశలో సైతం పలు మీడియా సంస్థలు తమ పోరాటాల స్ఫూర్తిని దిగజార్చేలా, స్థానిక సంస్కృతిని కించపరిచే విధంగా వ్యవహరించడం సరి కాదని వారన్నారు.
తెలంగాణలోని టీవీ చానెళ్లలో సిఇవో నుండి అటెండర్ వరకు తెలంగాణకు చెందినవారినే నియమించాలని వారు డిమాండ్ చేశారు. చానెళ్ల ప్రసారాలను నిలిపివేసి మీడియా సంస్థలను ఇబ్బంది పెట్టడం తమ అభిమతం కాదని, కానీ మీడియా ముసుగులో ప్రజల ఆకాంక్షలను, సంస్కృతిని అవమానపరుస్తూ కొన్ని మీడియా సంస్థలు పైశాచిక ఆనందాన్ని పొందడం తమను ఆగ్రహానికి గురి చేసిందని వారు స్పష్టం చేశారు. మొత్తం మీద వ్యవహారం కొరకరాని కొయ్యగా తయారైంది.