జగన్ నిలదీశాకే: బీజేపీ,టీడీపీ కత్తులు నూరుకుంటూ..
హైదరాబాద్: తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు ఒకరి పైన మరొకరు కత్తులు నూరుకుంటూనే మరోవైపు స్నేహగీతం ఆలపిస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు శాసన సభలో ఆ పార్టీల పైన సెటైర్లు వేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు అరకొర నిధులు, ప్రత్యేక ప్యాకేజీ.. తదితర అంశాల పైన బీజేపీ పైన టీడీపీ దుమ్మెత్తి పోస్తూనే మళ్లీ కేంద్ర కేబినెట్లో ఉండటం ఏమిటని నిలదీశారు. దీనికి బీజేపీ, టీడీపీ మంత్రులు, సభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన ఎదురు దాడికి దిగారు.
అది ఎలా ఉన్నప్పటికీ... బీజేపీ, టీడీపీలు కత్తులు నూరుకుంటున్నట్లుగా కనిపిస్తూనే కలిసి ఉండే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ, టీడీపీలు పైకి నాటకాలు ఆడుతున్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది.
కేంద్ర బడ్జెట్లో ఏపీకి సరైన కేటాయింపులు లేవని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే, మంగళవారం అసెంబ్లీలో మాత్రం చంద్రబాబు కొంత తగ్గినట్లుగా కనిపించింది. తాము కేంద్రంతో కలిసి సాగుతామని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని వివరించే ప్రయత్నం చేశారు.
తాము కేంద్రం పైన ఒత్తిడి పెంచుతూనే.. మిత్ర పార్టీగా కొనసాగుతామని చెప్పారు. అసెంబ్లీలో విపక్ష వైసీపీ నిలదీసినందునే.. అసెంబ్లీలో బీజేపీ, టీడీపీలు కలిసి కట్టుగా ఉన్నట్లు మాట్లాడాయనే వారు కూడా ఉన్నారు.
అంతకుముందు వరకు టీడీపీ, బీజేపీ... ఈ రెండు పార్టీలు లోలోపన ఒకరి పైన మరొకరు ఆగ్రహంతో ఉన్నట్లుగా కనిపించిందని అంటున్నారు. బడ్జెట్ తర్వాత కేంద్రం పైన చంద్రబాబు అసంతృప్తి, హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హెచ్చరిక, మంత్రుల ఘాటు వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు.
అదే సమయంలో బీజేపీ కూడా టీడీపీతో తాడోపేడో అని తేల్చేందుకు సిద్ధమన్న రీతిలో వ్యవహరించిందని అంటున్నారు. కేంద్రం ఏపీకి సరైన కేటాయింపులు చేయలేదని అసెంబ్లీలో టీడీపీ చెబితే.. తాము ధీటుగా స్పందించాలని బీజేపీ నిర్ణయించింది.
మంగళవారం సభ ప్రారంభానికి ముందు బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు భేటీ అయ్యారు. చంద్రబాబు లేదా టీడీపీ సభ్యులు కేంద్రం పైన నిధుల విషయంలో తప్పు నెడితే అందుకు ధీటుగా స్పందించాలని నిర్ణయించారు. అయితే, జగన్ ఇరు పార్టీల పైన విమర్శలు గుప్పించడంతో ఇరువురు ఒక్కటై వైసీపీ పైన మండిపడ్డారని అంటున్నారు.