1580ఏళ్ల కిందటే తెలంగాణలో బుద్ధపూర్ణిమ(పిక్చర్స్)
తెలంగాణ రాష్ట్రంలో 1580 ఏళ్ల కిందటి నుండే బుద్ధ పూర్ణిమ రాజులకు ఆదరణ ఉందనే ఆదారాలు లభ్యమయ్యాయి. హైదరాబాద్ - చౌటుప్పల్ మార్గంలో గల ఒకప్పటి విష్ణుకుండినుల రాజుల రాజధాని ఇంద్రపాల నగరంలో సాక్ష్యాలు లభించాయని చరిత్రకారుడు ధ్యావనవల్లి సత్యనారాయణ తెలిపారు.
గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా ఆదివారం ఆయన ఈ విషయం చెప్పారు. నల్గొండ జిల్లా తుమ్మలగూడెంలో బీఎన్ శాస్త్రి గతంలో సేకరించిన రాగి శాసనాల ఆధారంగా గోవింద వర్మ అనే రాజు వైశాఖ పౌర్ణమి నాడు బౌద్ధాచార్యులు దశబలబలికి పేణ్కపర, ఎన్మదల అనే గ్రామాలను దానం చేసినట్లుగా తెలుస్తోంది.
అదే సమయంలో అక్కడి పరమమహా విహారాన్ని రాజు భార్య పరమ భట్టారికా మహాదేవి నిర్మించినట్లు శాసనం తెలుపుతోంది. వాటి ఆధారంగా తుమ్మలగూడెం పరిసరాల్లో పరిశోధన చేశారు. 15 అడుగుల ఎత్తైన బండరాళ్లను విహారానికి సంబంధించిన ముగ్గురు బౌద్ధ ఆచార్యుల విగ్రహాలు కనిపించాయి.
దొరికిన ఆధారాల పరంగా రెండు ప్రతిమలు దిగ్నాగుడు, దశబలబలివని తెలుస్తోంది. నాగపడగతో ఉన్న శిల్పం ఆచార్య నాగార్జునుడిదని, కీసరగుట్టలో చరిత్రకారుడు జితేంద్ర బాబుకు లభించిన ఆచార్య నాగార్జునుని లోహశిల్పంతో పోల్చితే అర్థమవుతోందంటున్నారు.
బుద్ధ పూర్ణిమ
హైదరాబాద్ - భువనగిరి - వలిగొండ మీదుగా గానీ, హైదరాబాద్ - చౌటుప్పల్ మీదుగా గాని సుమారు 75 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఒకప్పటి విష్ణుకుండినుల రాజుల రాజధాని నగరమైన ఇంద్రపాల నగరాన్ని చేరుకోవచ్చు.
బుద్ధ పూర్ణిమ
ఇప్పటికే పూజించబడుతున్న శివాలయాన్ని దాటి శంకర్ గుట్ట వైపుగా, మూసీ నదివైపుగా ఒక అర ఫర్లాంగు దూరం నడిచి అక్కడ కనిపించే 30 అడుగుల ఎత్తైన మూడు గుండ్ల సముదాయంలోకి వెళ్తే వాటిల్లో రెండు గుండ్లకు 15 అడుగుల ఎత్తున్న బుద్ధుడు, ధ్యానముద్రలో కుర్చున్న శిల్పాలు, బౌద్ధ ఆచార్యుల శిల్పాలున్నాయి.
బుద్ధ పూర్ణిమ
ఇదే కాలంలో ఉత్తర భారతంలోని సారనాథ్లో ఇలాంటి బౌద్ధ శిల్పకళనే ప్రాచుర్యంలోకి రావడం గమనార్హం. ఈ కాలంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించిన బౌద్ధాచార్యుడు దిగ్నాగుని శిల్పం, గోవింద వర్మ శాసనంలో పేర్కొనబడిన మరో ఆచార్యుడు దశబలబలి శిల్పాలను ఇక్కడి ఆచార్యుల శిల్పాల్లో పోల్చుకోవచ్చు.
బుద్ధ పూర్ణిమ
నిల్చున్న భంగిమలో ఉన్న ఒక ఆచార్యుని శిల్పంపై నాగపడగ ఉంది. ఇది బౌద్ధాచార్యుల్లో అత్యంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఆచార్య నాగార్జునిడిది అయి ఉంటుంది. ఇలాంటిదే ఓ లోహ శిల్పం ఆచార్య నాగార్జునుడిది ఇదే విష్ణుకుండినుల రాజుల మరో రాజధాని ఐన కీసర గుట్ట పరిసరాల్లో చరిత్రకారుడు జితేంద్ర బాబుకు లభించింది.
ఇలాంటి ధ్యాన బౌద్ధులు, బౌద్ధాచార్యుల శిల్పాలే ఇంద్రపాలన నగరానికి దగ్గరలోని పంచేశ్వరాలయం సమీపంలో గల గుట్ట పైభాగంలో దర్శనం ఇస్తాయి. ప్రాముఖ్యమున్న ఇలాంటి చారిత్రక సంపదను ప్రజలు, ప్రభుత్వం కాపాడుకోవాలని సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.
రెండు విష్ణుకిండినుల రాజుల రాగి శాసనాలు తుమ్మలగూడెం గ్రామానికి చెందిన ఆంజేనేయులు ఇంట్లో లభ్యమయ్యాయి. మొదటి శాసనంలో గోవింద వర్మ అనే రాజు తన 37వ రాజ్య సంవత్సరంలో వైశాఖ పౌర్ణమి నాడు పేణ్కపర, ఎన్మదల గ్రామాలను దానం చేశాడు.
గోవింద రాజు 37వ రాజ్య సంవత్సరం క్రీ.శ. 435 అని బీఎన్ శాస్త్రి, నీలకంఠశాస్త్రి వంటి చరిత్రకారులు నిర్ధారించారు. అంటే ఈనాటికి సరిగ్గా 1580 సంవత్సరాల కిందడ తెలంగాణలో బుద్ధ పూర్ణి వేడుకలు జరిగాయని మొట్టమొదటి శాసనాధారం దొరికింది.
మరి శాసనంలో దీప, ధూప, గంధ, పుష్ప నైవేద్యాలు స్వీకరించినట్లు పేర్కొనబడిన బౌద్ధ విగ్రహాలు ఇప్పుడు ఇంద్రపాలన నగరంలో ఏమైనా ఉన్నాయా అని తాను వెదికానని సత్యనారాయణ చెప్పారు. అందులో తాను సఫలీకృతుడనయ్యానని చెప్పారు.