సెక్స్, ఆర్థిక కోణాలు: చంద్రబాబుకు కాల్మనీ చిక్కులు
హైదరాబాద్: కాల్ మనీ స్కామ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని చిక్కుల్లో పడేసినట్లే కనిపించింది. ఈ కుంభకోణం పాత్రధారుల్లో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి చెందినవారే ఉండడంతో చిక్కులు తప్పేట్లు లేవు. దీన్ని ఆసరా చేసుకుని ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ కుంభకోణంతో సాంకేతికంగా చంద్రబాబు ప్రభుత్వానికి సంబంధం లేకపోయినప్పటికీ, అధికారపార్టీగా ప్రజలు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. కాల్ మనీ కుంభకోణం మహిళలను పార్టీకి దూరం చేసే అవకాశాలున్నాయనే మాట వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి వెలుగుచూసిన సెక్స్-ఆర్ధిక కుంభకోణం కావడం, అందులో పాత్రధారులంతా అధికారపార్టీవారే కావడంతో ఈ వ్యవహారం అసెంబ్లీని తాకనుంది.
విజయవాడ కేంద్రంగా జరుగుతోన్న కాల్మనీ వ్యవ హారంలో ఇప్పటివరకూ పట్టుబడిన ఇద్దరూ తెలుగుదేశం పార్టీ నాయకులే కావడంతో టిడిపి చిక్కుల్లో పడింది. తాజాగా టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోదరుడు బుద్దా నాగేశ్వరరావుతోపాటు సముద్రాల నాగేశ్వరరావు, లంకలపల్లి సతీష్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరినుంచి దాదాపు 200 చెక్బుక్కులు స్వాధీనం చేసుకున్నారు. దీనితో నిందితులకు టిడిపితో ఉన్న సంబంధాలు బయటపడ్డాయని అంటున్నారు.
తనకు సోదరు డితో చాలాకాలం నుంచి సంబంధాలు లేవని బుద్దా వెంకన్న చెప్పి నప్పటికీ నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అదేవిధంగా నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ సెలవుపై వెళ్తుండడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించేందుకే సవాంగ్ను సెలవుపై పంపిస్తు్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సవాంగ్ నెలరోజుల క్రితమే సెలవు దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పుడు హఠాత్తుగా సెలవుపై పంపిస్తున్నారని చెప్పడంలో నిజం లేదని డిజిపి జెవి రాముడు చెప్పినా దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితిలోనే ఉన్నారు.
పెనమలూరు టిడిపి ఎమ్మెల్యే బోడె వెంకటేశ్వరరావు కూడా నిందితులతో కలసి విదేశీయాత్రలకు వెళ్లారని విపక్షాలన్నీ మూకుమ్మడి ఆరోపణలు చేస్తున్నాయి. నిందితులు తనకు స్నేహితులయినంత మాత్రాన, వారి వ్యాపారాలతో తనకెలాంటి సంబంధం లేదని ఆయన కన్నీటితో చెప్పినా, ఎమ్మెల్యే మాటలు కూడా ప్రజలు వినే పరిస్థి తిలో కనిపించడం లేదు. టిడిపి కార్పొరేటర్ కనకదుర్గ కూడా కాల్మనీ ఆరోపణలెదుర్కొంటున్నారు.
మరో కోణం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ చిక్కులను ఎదుర్కుంటోంది. నిందితులంతా ఒకే సామాజికవర్గానికి చెదిన వారు కావడంతో, రాజధాని పరిసర ప్రాంతాల్లో ఆ వర్గం హవా ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోందన్న చర్చ, మిగిలిన సామాజికవర్గాల వారిలోనూ మొదలయింది.
ఇప్పటికే బాధితుల వివరాలను సొంత మీడియా ద్వారా తెప్పించుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, దానిపై అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకువెళ్లి, అందరి దృష్టినీ ఆకర్షించింది. కాల్మనీ వ్యవహారంలో దోషులంతా టిడిపికి చెందిన వారేనని ఏపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి నేతృత్వంలో కేంద్రమాజీమంత్రి జైరాంరమేష్, కాంగ్రెస్ ఎంపిలు కెవిపి, జెడి శీలం, టి.సుబ్బిరామిరెడ్డి తదితరులు జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ సిరియాక్ జోసఫ్కు ఫిర్యాదు చేశారు.
అన్నీ విన్న ఆయన ఇది నిర్భయ కంటే పెద్ద సంఘటన అని వ్యాఖ్యానించి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేశారు. వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు ఢిల్లీ నుంచి బృందాన్ని పంపిస్తామని భరోసా ఇచ్చారు. ఇది కూడా ప్రభుత్వానికి దెబ్బగానే భావించాలి. కాల్మనీ నిందితులను చంద్రబాబు రక్షిస్తున్నారని, ఆయన పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులకు ఇందులో వాటా ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రఘువీరా ఆరోపించారు.