ఆలైన్మెంట్ ట్విస్ట్: మెట్రో రైలుపై కేంద్రం గెజిట్!
న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైలును కేంద్ర మెట్రో రైలు చట్టం పరిధిలోకి తెచ్చింది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు భద్రతా పనులు ట్రామ్ వే చట్ట పరిధిలో కొనసాగుతున్నాయి. దీంతో రైల్వే భద్రత బోర్డు ఈ ప్రాజెక్టు భద్రతా వ్యవహారాలను పరిరక్షించేందుకు నిరాకరిస్తోంది.
కేంద్రం చట్టం పరిధిలోకి రానిదే భద్రతా వ్యవహారాలను పరిరక్షించబోమని తెలిపింది. దీని పైన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. దీంతో హైదరాబాద్ మెట్రో రైలు తొలిదశ మార్గం పైన అధికారికంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా, 71.16 కిలోమీటర్ల మేర మెట్రో రైలు పనులు జరుగుతున్నాయి.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ను మంగళారం జారీ చేసింది. ఈ ప్రాజెక్టులో 1, 2, 3 మూడు కారిడార్లపై ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తొలి దశ పనుల్లో అలైన్మెంట్లో ఏ మార్పు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని అందులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
అయితే, కేంద్రం మెట్రో రైలు మార్గాన్ని నిర్ధారిస్తూ గెటిజ్ నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ అవసరాలకు అవసరాలకు అనుగుణంగా మార్గంలో మార్పులు చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. మార్పులు చేయాలనుకుంటే నిర్మాణ సంస్థకు నోటీసు జారీ చేయాల్సి ఉంటుందని, నిర్మాణ సంస్థ నుండి వచ్చే అభ్యంతరాలను స్వతంత్ర ఇంజనీర్ ద్వారా ధ్రువీకరించి, సంస్థకు నష్టపరిహారం చెల్లించి మార్పులను ఆచరణలోకి తీసుకురావచ్చని అంటున్నారు.
ఆ తర్వాత సవరించిన మార్గానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంతో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మరోసారి నోటిఫికేషన్ జారీ చేయవచ్చని, హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వానికి, మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణ సంస్థకు మధ్య ఇటీవల భేదాభిప్రాయాలు పొడచూపిన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ రావడం గమనార్హం. ఈ అంశంపైనే సోమవారం ఢిల్లీలో ప్రధాన మంత్రి కార్యదర్శిని, కేబినెట్ సెక్రటరీని సోమవారం కలిసిన తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలహాదారు పాపారావు హస్తినలో ఉండగానే ఈ నోటిఫికేషన్ వచ్చింది.