బాబు 100రోజులు: జగన్పార్టీతో ప్లస్, కేసీఆర్తో..!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా పగ్గాలు చేపట్టి మంగళవారానికి వంద రోజులు పూర్తవుతుంది. గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదిన్నరేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు.. ఇప్పుడు పదమూడు జిల్లాల ఏపీ బాధ్యతలను నెత్తిన వేసుకున్నారు. విభజన నేపథ్యంలో ఏపీ పలు సమస్యలు ఎదుర్కొంటుంది. ఆర్థిక లోటు, రాజధాని లేకపోవడం, రాజధాని నిర్మాణం.. తదితర ఎన్నో సమస్యలు చంద్రబాబు ముందు ఉన్నాయి.
కేంద్రం సహకారంతో 2029 నాటికి ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్థికలోటు ఉన్నప్పటికీ.. వంద రోజుల్లో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో బాబు ముందడుగు వేశారు. సంక్షేమ రంగంలో మాత్రం రాష్ట్రం వెనకబడి ఉంది. అక్టోబర్ నుంచి సంక్షేమ కార్యక్రమాలను భారీ ఎత్తున అమలు చేస్తానని ప్రకటించడంతో మరో వంద రోజులపాటు ఈ రంగంలో ప్రజల స్పందనను వేచి చూడాల్సి ఉంది.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా రుణమాఫీ విషయంలోనూ ప్రభుత్వం తడబాటుకు గురవుతోంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా రుణమాఫీని అమలు చేసి తీరుతామని ప్రభుత్వం చెబుతుంటే, ప్రతిపక్ష పార్టీ మాత్రం అక్టోబర్ నుంచి ఉద్యమం చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రధానంగా రాజధాని ఎంపిక ప్రక్రియ జటిలమవుతుందనుకున్న అంచనాలను పటాపంచలు చేస్తూ విజయవాడ పరిసరాలను రాజధానిగా అసెంబ్లీలోనే ప్రకటించారు.
వచ్చే అక్టోబర్ నుంచి విజయవాడ తాత్కాలిక రాజధానిగా ఏర్పాటు చేసి కొన్ని ప్రభుత్వ శాఖలను తరలించేందుకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రాభివృద్ధికి దోహదపడే ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదాలో మాత్రం జాప్యం జరుగుతోంది. ప్రత్యేక హోదాపై ఉత్కంఠ కొనసాగుతోంది. కేంద్రం ప్రణాళిక సంఘాన్ని కూడా రద్దు చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి పన్నుల్లో రాయితీలు వస్తాయి. మూలధనం సబ్సిడీపై ఆదాయం పన్ను రాయితీ ఉంటుంది.
కేంద్రం అమలు చేసే పథకాల వ్యయంలో 90 శాతం భరిస్తే, పది శాతం మాత్రమే రాష్ట్రం పెట్టుకుంటుంది. జాతీయ అభివృద్ధి మండలిలోనే ప్రత్యేక హోదా సంగతి తేలాల్సి ఉంటుంది. ఇక ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ విషయమై కేంద్రం ఇంతవరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు, రాజధాని తమ ప్రాంతంలో ఏర్పాటు చేయలేదని కినుక వహించిన రాయలసీమ ప్రజలకు వీలైనంత త్వరలోనే ప్యాకేజీ ఇచ్చి ఆగ్రహాన్ని చల్లార్చేందుకు సీఎం కృషి చేస్తున్నారు.
పార్లమెంటులో విభజన సమయంలో అప్పటి ప్రధానమంత్రికి, ప్రతిపక్షానికి మధ్య ఆరు సూత్రాలపై ఒప్పందం కుదిరింది. ఇందులో పోలవరం అంశం కింద ముంపు మండలాలు పూర్తిగా విలీనమయ్యాయి. ఉద్యోగులు, ఆస్తుల, అప్పుల పంపకాలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కేంద్రం ఈ ఏడాది రాష్ట్ర లోటు బడ్జెట్ 16వేల కోట్ల రూపాయలు భరించేందుకు పార్లమెంటులోనే అంగీకరించింది. ఈ ప్రతిపాదన కూడా అమలు కాలేదు. రుణమాఫీ సమస్యగా మారింది.
ఫీజు రీయింబర్స్మెంట్ విధి విధానాలపైనా ఇంకా మార్గదర్శకాలు ఖరారు కాలేదు. దుబారాపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంటుంది. విజయవాడను తాత్కాలిక రాజధాని చేస్తున్నట్టు ప్రకటిస్తూనే, సచివాలయంలో తనకు కేటాయించిన చాంబర్ను కోట్ల రూపాయలు పెట్టి మరమ్మత్తులు చేయించడం విమర్శలకు దారి తీసింది. మంత్రులు ఇతర సమాన ఉన్నత పదవుల్లో ఉన్న వారికి ఇంటి అద్దె భత్యాన్ని నెలకు ఒక లక్ష రూపాయలకు పెంచడంపై విమర్శలు వచ్చాయి.
కొత్త అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉన్నప్పటికీ.. అక్కడ అనుభవం ఉన్న నేతల కొరత ఉండడం కూడా చంద్రబాబుకు ప్లస్ పాయింట్గా మారిందనే వాదనలు ఉన్నాయి. మరోవైపు తెలంగాణ, ఏపీల మధ్య తొలుత రాజుకున్న వివాదాలు ఒక్కొక్క సమస్యను పరిష్కరించే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. కేసీఆర్ కూడా చర్చకు సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో.. ఇప్పటికే వారు ఓసారి భేటీ అయ్యారు.