ఫోన్ లోకేషన్ గుర్తింపు: బాబు వాయిస్ రికార్డు?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు పలు మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వాయిస్ను పరీక్షించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. నిజానికి వాయిస్ రికార్డింగ్ పరీక్ష కోర్టులో జరగాలి. కానీ, చంద్రబాబు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతో ఆయన గొంతును ఆయన సూచించే ప్రదేశంలో కొంత మంది న్యాయవాదుల సమక్షంలో రికార్డు చేసి, పరీక్షించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
కాగా, ఓటుకు నోటు కేసులో ఏసీబీ దర్యాప్తు బృందాలు కీలకమైన ఆధారాలు సేకరించినట్లు చెబుతున్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను కొనుగోలు చేసేందుకు స్కెచ్ వేసిన దగ్గరనుంచి ఎమ్మెల్యే రేవంత్రెడ్డి, సెబాస్టియన్ల ఫోన్ల నుంచి వెళ్లిన కాల్స్ డాటాద్వారా కీలక ఆధారాలు సంపాదించినట్టు తెలుస్తోంది.
రేవంత్రెడ్డి ఫోన్ కాల్ డాటాలోని బాస్తో పదేపదే మాట్లాడిన ఫోన్ లొకేషన్, స్టీఫెన్సన్తో బాస్ మాట్లాడిన ఫోన్ లొకేషన్ను ఏసీబీ అధికారులు గుర్తించారని అంటున్నారు.

అవి ఎక్కడి నుంచి వెళ్లాయనే విషయాన్ని కూడా ఎసిబి అధికారులు గుర్తించినట్లు చెబుతున్నారు. ఆ కాల్స్ రాకపోకలు ఏ అడ్రస్నుంచి.. ఏ ఇంటినుంచి సాగాయనేది లాన్ లాగ్తో ఏసీబీ అధికారులు చేధించినట్టు తెలిసింది. లొకేషన్లో చూపించిన ఆక్షాంశం, రేఖాంశాల గ్రాఫ్ద్వారా అడ్రస్ను ఇప్పటికే ఛేదించినట్లు తెలుస్తోంది.
ఈ ఫోన్ ఐఎంఈఐ నంబర్తోపాటు, జీపీఎస్కూడా సరైన అడ్రస్ను ఛేదించడంలో కీలకపాత్ర వహించినట్టు సాంకేతిక నిపుణులు అభిప్రాయపడ్డారు. ఒక ఫోన్ కాల్ ఆధారంగా జీపీఎస్తోపాటు లాన్లాగ్ గుర్తించిన గ్రాఫ్.. మరో ఫోన్కాల్ గ్రాఫ్కు ఏ మాత్రం సరిపోలదు. దీన్ని బట్టి చూస్తే బాస్ పక్కగా దొరికిపోయినట్టేనని భావిస్తున్నారు.
కుట్ర ప్రారంభమైన తేదీనుంచి రేవంత్రెడ్డి, సెబాస్టియన్ వారంపాటు ఎవరెవరికి ఫోన్లు చేశారు? ఎక్కడి నుంచి చేశారు? వారిద్దరికీ ఏ లొకేషన్ నుంచి? ఏ నంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయి? అనేది కాల్ డాటా ఆధారంగా టెక్నికల్గా దొరికిపోయిందని ఏసీబీ వర్గాల ద్వారా తెలిసింది. మే 28నుంచి మే 31 మధ్య సాగిన ఫోన్కాల్స్పై ప్రధానంగా ఏసీబీ అధికారులు విచారణ సాగిస్తున్నట్టు తెలిసింది. దాదాపుగా ఇలా ఒక ఫోన్ నుంచి 32 సార్లు రేవంత్, సెబాస్టియన్ల ఫోన్లకు కాల్స్ వచ్చినట్టు ఏసీబీ దర్యాప్తులో తేలినట్టు సమాచారం.












Click it and Unblock the Notifications