బాబుకు సవాల్: అప్పుడు జగన్, ఇప్పుడు కెసిఆర్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వలసల బెడద తప్పడం లేదు. ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి టిడిపి నుంచి వలసలను ప్రోత్సహించడం ద్వారా ఓ కుదుపు కుదుపాలని ప్రయత్నిస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తెలంగాణలో ఇప్పుడు అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. తద్వారా, చంద్రబాబుకు చిక్కులు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ నుంచి వలసలను ప్రోత్సహించడాన్ని ఒక వ్యూహంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెరాస అమలు చేస్తుండటం ఆసక్తికర రాజకీయ పరిణామాలకు దారి తీస్తోంది. తాజాగా తెలంగాణలో ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడం ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే పరిస్థితిని సీమాంధ్ర ప్రాంతంలో టీడీపీ ఎదుర్కొంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రోత్సాహంతో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు పార్టీని వీడారు. కానీ, జగన్కు ఆ ప్రయోజనం పెద్దగా దక్కలేదు. పార్టీ విజయానికి చేరువై తెలుగుదేశం పార్టీ చేతిలో ఓటమిపాలైంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి ఆంధ్రప్రదేశ్లో వలసలు ఆగిపోయాయి.

పైగా, ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఎన్నికలు ముగిసిన మరుక్షణమే ఎంపిగా గెలిచిన ఎస్పీవై రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి దండం పెట్టేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి దూరమయ్యారు. ఆమె తెలుగుదేశం పార్టీకి చేరువయ్యారు. తన ప్రజాప్రతినిధులను కాపాడుకోవడానికి వైయస్ జగన్ ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి వలసల చిక్కులు ప్రారంభమయ్యాయి. టీడీపీలోని ప్రతి ఎమ్మెల్యేను టీఆర్ఎస్ నేతలు తమ పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నం చేస్తుండటం, ఇందులో కొందరితో సీఎం కేసీఆర్ స్వయంగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతున్నట్టు గురువారం ఉదయం ప్రకటించారు. కానీ కొద్ది గంటల్లోనే వారిలో ప్రకాశ్గౌడ్ టీడీపీ అధినేత చంద్రబాబును కలుసుకొని తాను పార్టీ వీడటం లేదని ప్రకటించారు.
మరో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా పార్టీ మార్పుపై ఊగిసలాటలో ఉన్నారని, ఏం జరుగుతుందో చూడాలని టిడిపి వర్గాలు అంటున్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు కెసిఆర్ను కలవడం, ఆయన కూడా టిఆర్ఎస్లోకి మారుతారని ప్రచారం జరగడం టిడిపిని ఓ సందర్భంలో కుదిపేసింది. అయితే, ఆయన తాను పార్టీ మారడం లేదని, టిడిపిలోనే ఉంటానని స్ప్ష్టష్టం చేశారు. ఏమైనా, తెరాసలోకి జరుగుతున్న ఫిరాయింపులు తెలంగాణలో టీడీపీ నేతలను ఒత్తిడికి గురిచేస్తున్నాయి.
ఖమ్మం జిల్లాలో తాను అడిగిన సీటుకు తనను మార్చలేదన్న కోపంతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పార్టీని వీడారు. మాజీ మంత్రి తలసానిని కోరిన సీటు(సనత్నగర్)కు మార్చినా వెళ్లిపోయారు. జిల్లాల్లోని గ్రూపు తగాదాలా కారణంగానే కాకుండానే, అధికార పార్టీ వైపు వెళ్లడం ద్వారా రాజకీయ భవిష్యత్తను మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతో ఈ వలసలు సాగుతున్నట్లు భావిస్తున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా తలసాని ఆ పార్టీలోకి వెళ్లాలని ప్రయత్నించారని, కానీ ఆయన చనిపోవడంతో ఆగిపోయారని అప్పట్లో ప్రచారం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం సీటు కోసం బీజేపీ గట్టిగా పట్టుపట్టింది. అయినా ఆ పార్టీ నేతలకు నచ్చజెప్పి ఆ సీటును తీగల కృష్ణారెడ్డికి చంద్రబాబు ఇచ్చారు. అయినా తీగల కూడా పార్టీని వీడారు. నిజానికి, తీగల కృష్ణా రెడ్డికి టిడిపిలో మొదటి నుంచీ ఎక్కువ ప్రాధాన్యమే లభిస్తోంది. అయినా, ఆయన పార్టీని వీడడానికే సిద్ధపడ్డారు.
తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఖాళీ చేయాలనే కెసిఆర్ ఎత్తుగడ రాష్ట్రం ఏర్పడకు ముందు నుంచే అమలవుతూ వస్తోంది. రాష్ట్రం ఏర్పడి తాను అధికారంలోకి వచ్చిన దాన్ని మరింత ముమ్మరం చేశారు. ఇప్పుడు ప్రధానంగా ఆయన హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టిడిపి నుంచి వలసలను ప్రోత్సహిస్తున్నారు. మొత్తంగా ఇది తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఇబ్బంది పెట్టే పరిణామమే.












Click it and Unblock the Notifications