బాబుకు దెబ్బ మీద దెబ్బ: జగన్కు పెద్ద ఊరట
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో ఆత్మరక్షణ చేసుకోవడానికి అవసరమైన ఆయుధాలు ఆయాచితంగా అంది వచ్చాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసులో పట్టుబడడంతోనే జగన్కు కొంత ఊరట లభించింది. తాజాగా, ఆంధ్రప్రదేశ్ మంత్రి పీతల సుజాత అంశంలో మరింతగా ఆయనకు ఊరటనిచ్చింది. పీతల సుజాత ఇంటి ఆవరణలో పది లక్షల రూపాయల నోట్ల కట్టలు గల సంచీ లభించడం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై మరో దెబ్బ పడింది.
ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి విషయంలోనే ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు నాయుడు పీతల సుజా విషయంలో మరింతగా ఇబ్బందిలో పడినట్లు భావించవచ్చు. పీతల సుజాతపై గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. గతంలో పీతల సుజాతకు 40 లక్షల రూపాయల విలువ చేసే వడ్డాణం బహుమతి ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. ఇది కూడా అప్పట్లో తీవ్ర సంచలనానికి కారణమైంది.

అవినీతికి సంబంధించి వైయస్ జగన్పై చంద్రబాబుతో పాటు ఆంధ్రప్రదేశ్ మంత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తుతూ వచ్చారు. జగన్ ఏది మాట్లాడినా అక్రమాస్తుల కేసును ప్రస్తావిస్తూ ఆయన అవినీతికి సంబంధించి దుమ్మెత్తి పోస్తూ వచ్చారు. అయితే, ఇక నుంచి వారు జగన్పై అవినీతి ఆరోపణలు చేసే అవకాశం లేకుండా పోయింది.
రేవంత్ రెడ్డి కేసులో చంద్రబాబును తొలి ముద్దాయిగా చేర్చాలని కోరుతూ జగన్ గవర్నర్ను కోరారు. ఆ రకంగా ఆయన ఎదురుదాడికి దిగే పరిస్థితులు వచ్చాయి. రేవంత్ రెడ్డి విషయంలోనే కాకుండా ఇప్పుడు పీతల సుజాత విషయం కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులకు ఆయుధంగా అంది వచ్చింది.
జగన్పై తెలుగుదేశం పార్టీ నాయకులు అవినీతి ఆరోపణలు చేయడానికి అవకాశం లేకుండా రేవంత్ రెడ్డి, పీతల సుజాత ఉదంతాలు చేశాయని అంటున్నారు. ఈ విషయంలో తెలుగుదేశం నాయకులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications