టిడిపిపై పవన్ 'పంజా': టిలోను పోటీ, ఈ స్థానాల్లో!
హైదరాబాద్: ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ నెల 14న రాజధానిలో ప్రారంభించనున్న పార్టీ తెలుగుదేశం ఓటు బ్యాంకుకు చిల్లు పెట్టనుందా? అంటే అవుననే అంటున్నారు. పవన్ ఇండిపెండెంట్గా అభ్యర్ధులను రంగంలోకి దించినా, పార్టీ పెట్టినా ఆ ప్రభావం టిడిపిపై తీవ్రంగా ఉండవచ్చునని చెబుతున్నారు. సీమాంధ్రలో అధికారంలోకి రావాలని తాపత్రయపడుతున్న టిడిపికి పవన్ నిర్ణయం కంటిమీద కునుకులేకుండా చేస్తోందట.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో పలువురు సీనియర్ కాంగ్రెసు నేతలు ఇటీవల టిడిపిలో చేరుతున్నారు. వరుసగా రెండుసార్లు అధికారానికి దూరంగా ఉన్న టిడిపి ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. అయితే, ఇప్పుడు పవన్ పార్టీ టిడిపిని ఆందోళనకు గురి చేస్తోందని చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పవన్ పార్టీ పోటీ వల్ల పరిమిత స్థానాలైనా, అక్కడ తెదేపా విజయావకాశాలను గండికొట్టే అవకాశాలు చాలా ఉన్నాయి.

గత ఎన్నికల్లో ప్రజారాజ్యం దెబ్బకు దాదాపు యాభైకి పైగా చోట్ల స్వల్ప మెజార్టీతో టిడిపి పరాజయం పాలైంది. మరోవైపు, మీడియా మాయవల్ల పవన్ ప్రభావాన్ని గోరంతలు కొండంతలు చేసి చూపిస్తున్నారని, చిరంజీవి ఇచ్చిన షాక్కే ఇప్పటికీ ఒక సామాజికవర్గం కోలుకోలేదని, మళ్లీ ఇప్పుడు ఆ తానులోని ముక్కను నమ్మేందుకు జనం సిద్ధంగా లేరని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. పవన్ దెబ్బకు తమ ఓటు బ్యాంకు కూడా దెబ్బతింటుందని కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను కూడా వెంటాడుతోందని చెబుతున్నారు.
పవన్ వచ్చే గురువారం మాదాపూర్ హైటెక్స్లో సాయంత్రం గంటసేపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి పవన్ కరడుగట్టిన అభిమానులు, సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. పవన్ తొలుత 45 నిమిషాలు ప్రసంగించి, తాను రాసిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. తన ప్రసంగంలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించనున్నారని సమాచారం.
ఇప్పటికిప్పుడు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం కంటే ఆంధ్రా, తెలంగాణలో 60అసెంబ్లీ స్థానాలు, 10 లోక్సభ స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. ఈ 60 అసెంబ్లీ స్థానాల్లో 35 ఆంధ్రాలో, తెలంగాణలో 25 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఆంధ్రలోని 35 స్థానాల్లో ఉత్తరాంధ్రలో ఐదు, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 20, రాయలసీమ, నెల్లూరు, ఒంగోలులో పది స్థానాలను ఎంపిక చేసినట్టు సమాచారం.
అలాగే తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాలో 20 స్థానాలు, ఉత్తర తెలంగాణలో ఐదు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయనున్నారు. ఆంధ్రాలో ఆరు లోక్సభ స్థానాలు, తెలంగాణలో నాలుగు లోక్సభ స్థానాలకు పోటీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
చిరంజీవి రాజకీయంగా వేసిన తప్పటడుగుల ప్రతికూల ప్రభావం పవన్పై పడటం ఖాయంగా కనబడుతోందంటున్నారు. చిరంజీవిని నమ్ముకుని వందల కుటుంబాలు ప్రజారాజ్యంలోకి వచ్చి టిక్కెట్ల కోసమని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టారని, చివరకు 18 సీట్లులో పిఆర్పీ గెలిచిందని, ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్లో కలిపేశారని చెబుతున్నారు. విభజన సమయంలో చిరంజీవి అనుసరించిన వ్యవహార శైలి కూడా పవన్పై పడొచ్చని అంటున్నారు. అలాంటి ప్రభావం ఏమీ ఉండదనే వారు లేకపోలేదు.
పవన్ పెట్టే రాజకీయ ఫోరంలోకి గతంలో మాదిరిగా అభిమానులు వెంటబడి వస్తారా? అనేది ప్రశ్నార్ధకమే. పవన్ మంచి వక్త. రాజకీయ, సామాజిక స్పృహ ఉన్న నాయకుడి లక్షణాలు ఉన్నాయి. ఆంధ్రాలో అనకాపల్లి, కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం, విజయవాడ, రాజంపేట స్థానాలపై , తెలంగాణలో మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, ఖమ్మం స్థానాలను పవన్ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications