సీమ ప్రాజెక్టులు: కాంట్రాక్టర్లపై చంద్రబాబు సీరియస్
హైదరాబాద్: నీటి పారుదుల ప్రాజెక్టుల కాంట్రాక్టర్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రాజెక్టు పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి సహకరించని కాంట్రాక్టర్లకు నోటీసులిచ్చి, వారిని కొంత కాలం బ్లాక్ లిస్టులో చేర్చాలని సిఎం చంద్రబాబు బుధవారం అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పనులపై అధికారులను ఆయన నిలదీశారు.
రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణ పనుల పురోగతిపై కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాయలసీమ విషయానికి సంబంధించి డిమాండ్లు తలెత్తుతున్న తరుణంలో ఆయన ఆ ప్రాంత ప్రాజెక్టులపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.
జీడిపల్లి వద్ద జూలై 23న తాను ప్రాజెక్టుల నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించానని, తర్వాత పనులు ఎంతవరకు వచ్చాయో వివరించాలని అధికారులను నిలదీశారు. పని ఎంత జరిగిందో, ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పండంటూ అధికారులను నిలదీశారు. 23 రోజుల్లో జరిగిన పనితీరుపై సిఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. భూసేకరణ, పూడికతీత, కాంక్రీట్ పనులను వేగవంతం చేయాలని చెప్పారు.
పోలవరం కుడి ప్రధాన కాల్వ పనులకు 700 కోట్లు ఖర్చు చేశామని, భూసేకరణకే 1028 కోట్లు వ్యయం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి జలాల్లో ఒక్క టిఎంసి నీటిని ఆదా చేసి అయినా ఈ ఏడాదే రాయలసీమకు ఇవ్వాలని తాను ఆరాటపడుతున్నానని అన్నారు. తన తపనకు తగ్గట్టు రాయలసీమ జిల్లాల జలవనరుల శాఖ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాలుగు జిల్లాల్లో వర్షపాతం నమోదు, రిజర్వాయర్లలో జలమట్టాలపై సిఎం విశ్లేషించారు. గాలేరు నగరి, హంద్రీ నీవా ప్రాజెక్టు పనులపై ప్యాకేజీల వారీ పనుల పురోగతిని అధికారులతో, కలెక్టర్లతో సమీక్షించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి హంద్రీ నీవా పనులు పూర్తి కావాలని అన్నారు. జలవనరుల శాఖ అధికారులు, కింది స్థాయి ఉద్యోగుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందని, కలెక్టర్లు చొరవ తీసుకుని ఆయా జిల్లాల్లో ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అన్నారు.
భూ సేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులను ఒప్పించాలని, నిధులను వెంటనే విడుదల చేయాలని సిఎం పేర్కొన్నారు. పూడికతీత పనులకు కావల్సిన ప్రొక్లెయిన్లు, టిప్పర్లు, ట్రాక్టర్లు సమకూర్చుకోవడంలో రవాణా శాఖ, రెవిన్యూ అధికారుల సహకారం తీసుకోవాలని అన్నారు. లక్ష్యాల పట్ల స్పష్టత ఉందని, జలవనరుల శాఖ అధికారులు, ఉద్యోగుల్లో అక్కడక్కడా స్పష్టత కొరవడుతోందని అన్నారు.