మోడీతో జిన్పింగ్, చొచ్చుకొచ్చిన చైనా సైనికులు
న్యూఢిల్లీ: చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ బుధవారం మూడు రోజుల భారత్ పర్యటనకు వచ్చి అహ్మదాబాద్లో ప్రధాని నరేంద్ర మోడీతో చర్చలు జరుపుతుంటే.. చైనా సైనికులు లడక్లోని మన భూభాగంలోకి మరోసారి చొచ్చుకు వచ్చి గుడారాలు వేశారు. డెంచుక్ ప్రాంతంలో రెండు దేశాల ప్రజలు ప్లకార్డులతో నిరసనలు తెలుపుకున్నారు.
చైనా సైనికులు గత మూడు రోజులుగా ఈ ప్రాంతంలో గొడవ చేస్తూ ఉన్నారు. వీరి కార్యకలాపాలను అరికట్టేందుకు రక్షణ శాఖ అక్కడికి పెద్ద ఎత్తున సైనికులను పంపించినట్లు చెబుతున్నారు. మూడు రోజుల క్రితం దాదాపు మూడు వందల మంది చైనా సైనికులు చునూర్ సెక్టార్లోని మన భూభాగంలోకి వచ్చి గుడారాలు వేయటంతోపాటు భారీ యంత్ర పరికరాలతో వచ్చి ఒకటిన్నర కిలో మీటర్ల మేర రోడ్డు నిర్మించారు.

ఈ సంఘటనపై ఇరుదేశాల సీనియర్ అధికారులు ఫ్లాగ్ సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. బుధవారం కూడా ఫ్లాగ్ సమావేశం జరిపినా పరిష్కారం లభించలేదు. ఒక వైపు ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనే చైనా దేశానికి చెందిన పలువురు పౌరులు మన భూభాగంలో చొచ్చుకు వచ్చారని సమాచారం.
ఇది తమ భూభాగమని, తాము ఇక్కడి నుండి కదిలేది లేదనే బ్యానర్లు చైనా పౌరులు ప్రదర్శించారు. చుముర్ ప్రాంతంలో మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన సైనా సైనికులు అక్కడికి దాదాపు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న డెంచోట్లో భారత సైనికులు నీటిపారుదల కాలువను నిర్మించటం పట్ల అభ్యంతరం తెలిపారు.
కాగా, ఈ సంవత్సరంలో చైనా సైనికులు ఇంతవరకు మూడు వందల యాభై నాలుగు సార్లు మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చారు. ఇప్పుడు చైనా అద్యక్షుడు మన దేశంలో పర్యటించే సమయంలోనే చొచ్చుకు రావడం గమనార్హం.
సరిహద్దుల్లో ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం చైనా సైనికుల చొరబాట్ల గురించి పెదవి విప్పటం లేదు. విదేశాంగ శాఖ ప్రతినిధి అక్బరుద్దీన్ విలేకరులతో మాట్లాడుతూ సరిహద్దుల్లో ఏం జరిగినా మన సైనికులు చూసుకుంటారన్నారు. కాగా, చైనా ఆర్మీ లడక్లోకి చొచ్చుకు వచ్చే అంశాన్ని జీ జిన్పింగ్తో మోడీ చర్చించే అవకాశముంది.












Click it and Unblock the Notifications