ఘాటుగానే: జగన్నే తప్పు పట్టిన కాంగ్రెస్, టిడిపి
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల విషయమై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైనే ఇటు కాంగ్రెసు, అటు తెలుగుదేశం పార్టీలు మండిపడుతున్నాయి. నీవు నేర్పిన విద్యయే అంటు నిప్పులు చెరుగుతున్నారు. రెండు రోజుల క్రితం టిడిపి నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ... ఫిరాయింపులు జగనే నేర్పారని చెప్పారు. సిఎం రమేష్ వంటి టిడిపి నేతలు మాట్లాడుతూ.. ఫిరాయింపులు ఇప్పుడు తప్పుగా కనిపిస్తున్నాయా అని ఘాటుగా స్పందించారు. సోమవారం ఎపిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి కూడా జగన్కు షాకిచ్చారు. నీవు నేర్పిందేనని విమర్శించారు.
ఒకప్పుడు లాభం, ఇప్పుడు నష్టం అన్నది సరికాదన్నారు. జగన్ తొలుత కాంగ్రెసు నుండి గెలిచి తర్వాత సొంత పార్టీ పెట్టుకున్నారని, 17, 18 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలను తీసుకున్నారని, తాము తక్కువ తిన్నామా అని టిడిపి పోటీ పడిందన్నారు. సిద్ధాంతాలు వల్లించే బిజెపి ఎన్నికల సమయంలో అదే చేసిందన్నారు. ప్రజా తీర్పును అపహాస్యం చేసే కప్పదాట్లను నియంత్రించాల్సిన అవసరముందన్నారు.
ఫిరాయింపు నిరోధక చట్టానికి మరింత పదును పెట్టాల్సి ఉందని చెప్పారు. పార్టీ ఫిరాయింపు అనైతికమని, 2009 తర్వాత రాష్ట్రంలో ఈ సంస్కృతి చాలా ఎక్కువైందని అభిప్రాయపడ్డారు. జగన్ ఇందులో భాగస్వామి అన్నారు. ఆక్సిజన్ లేకపోయినా బతకగలం కానీ అధికారం లేకుండా ఉండలేమనే ధోరణి రాజకీయాల్లో ప్రబలిందన్నారు. రాజకీయం వ్యాపారమైందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని పెట్టుబడిగా చూడవద్దన్నారు.
అధికార పార్టీలో లేకపోతే ఆ పెట్టుబడి రావడం కష్టమనే భావన నెలకొందన్నారు. వ్యభిచారం అనే పదం వాడకూడదని...వారే వీరి కంటే గౌరవప్రదంగా ఉన్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. కాగా, జంప్ జిలానీల పైన ఇటు కాంగ్రెసు, అటు తెలుగుదేశం కూడా జగన్ నేర్పిన విద్యయే అని విమర్శించడం గమనార్హం. జగన్ పార్టీని స్థాపించాక టిడిపి, కాంగ్రెసు పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు గతంలో ఆయన పార్టీలో చేరిన విషయం తెలిసిందే.