'హుధుద్': ఇజ్రాయెల్ జాతీయ పక్షి పేరు..
విశాఖపట్నం: విశాఖపట్నం దగ్గర తీరం దాటే పెను తుఫానుకు హుధుద్గా నామకరణం చేశారు. బంగాళాఖాతం, అరేబియా సముద్రాలలో పుట్టే తుఫాన్లకు పేరు నిర్ణయించే అవకాశం భారత్తో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, ఒమన్, మాల్దీవులు, మయన్మార్, పాకిస్తాన్, థాయ్లాండ్ దేశాలకు ఉంది.
ఈ దఫా తుఫానుకు పేరు పెట్టే అవకాశం ఒమన్ దేశానికి వచ్చింది. దీంతో ఆ దేశం.. హుధుద్ అనే పేరు పెట్టింది. హుధుద్ ఒక పక్షి పేరు. ఆఫ్రికా, యూరప్, ఆసియాలలోని కొన్ని దేశాలలో ఇది కనిపిస్తుంది. ఇజ్రాయెల్ దేశ జాతీయ పక్షి హుధుద్.
కాగా, ఉత్తరాంధ్రపై హుధుద్ తీవ్ర ప్రభావం చూపనుంది. నాలుగైదు రోజులుగా సముద్రంలో తిష్టవేసిన హుధూద్ ఇక కేవలం గంటల వ్యవధిలోనే తీరాన్ని అతలాకుతలం చేయనుంది. గంటకు గరిష్ఠంగా 195 కిలోమీటర్ల వేగంతో ఉత్తర కోస్తాపై విరుచుకుపడనుంది. ఈ క్రమంలో రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్రతోపాటు దక్షిణ ఒడిశాను భారీ నుంచి అతిభారీ వర్షాలు ముంచెత్తనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ మేరకు రెడ్ మెసేజ్ జారీ చేసింది. తీవ్ర పెను తుఫాన్గా మారి కోరలు చాస్తున్న హుధుద్ దిశ, తీవ్రతపై వాతావరణ శాఖ శనివారం బులెటిన్ విడుదల చేసింది. శనివారం అర్ధరాత్రి 12 గంటలకు విశాఖపట్టణానికి 200 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు ఆరేడు కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్న ఇది... వాయవ్య దిశగా కదిలి ఆదివారం మధ్యాహ్నానికల్లా విశాఖకు సమీపంలో తీరాన్ని తాకనుందని అధికారులు తెలిపారు.
ఆ సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాల్లో గంటకు గరిష్ఠంగా 195 కిలీమీటర్ల వేగంతో భీకర గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పక్కనే ఉన్న పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో గంటకు 80-90 కిలోమీటర్ల వేగంగా బలమైన గాలులు వీస్తాయని ప్రకటించింది.
తీవ్ర పెను తుఫాన్వల్ల ఆంధ్రాలోని ఈ జిల్లాలతోపాటు ఒడిసాలోని గంజాం, గజపతి, కోరాపుట్, రాయగడ, నవరంగ్పూర్, మల్కాన్గిరి, కలహండి, ఫుల్బణి జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. ఈ రెండు రోజుల్లో సముద్రం అల్లకల్లోలంగా మారి, భారీగా అలలు ఎగసిపడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తీవ్ర పెను తుఫాన్ విశాఖను సమీపిస్తున్న కొద్దీ గాలుల ఉధృతి పెరుగుతోంది.
దీంతో అలలు ఎగసిపడుతున్నాయి. శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకు అనేకచోట్ల వర్షాలు ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి నుంచి ఈ వర్షాలు పెరుగుతాయని విశాఖ తుఫానుల హెచ్చరిక కేంద్రం ప్రకటించింది.
ఆదివారం ఉత్తర కోస్తా, ఉభయ గోదావరితోపాటు కృష్ణా నుంచి ప్రకాశం జిల్లా వరకూ విస్తారంగా, రాయలసీమలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ రామచంద్రరావు తెలిపారు. తీవ్ర పెను తుఫాన్ తీరం దాటే సమయంలో సముద్ర అలలు రెండు మీటర్ల ఎత్తు వరకూ ఎగసిపడతాయి. దీంతో ఉత్తర కోస్తా జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతాయి. తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది.