15వేలిస్తే కెసిఆర్కి లీజుకి: ఫాంహౌస్పై ఎర్రబెల్లి సెటైర్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన సభలో మంగళవారం నాడు రైతు సమస్యల పైన చర్చ సందర్భంగా... తెలంగాణ టిడిపి శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు... ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫాం హౌస్ పైన సెటైర్లు వేశారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ తన ఫాంహౌస్కు ఎమ్మెల్యేలను తీసుకు వెళ్లాలని ఎర్రబెల్లి సూచించారు. కెసిఆర్ ముఖ్యమంత్రి కాక ముందు తన ఫాం హౌస్లో ఎకరాకు రూ.కోటి పండించినట్లు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రికి పంటలు పండించడం ఆసక్తి అని, అలా అయితే ఆయన ఆదర్శ రైతు అన్నారు. అందుకే, ఇక్కడ అన్నీ వదిలేసి ఫాంహౌస్కు వెళ్తుంటారని చురకలు అంటించారు. కానీ, రైతులందర్నీ కూడా అలాగే తయారు చేయాలని చెప్పారు.
కెసిఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఫాంహౌస్లోని మీ పంటను చూసి... కెసిఆర్ సీఎం అయితే రైతులందరు ఇలాగే అవుతారని అనుకున్నామని, ప్రతి రైతు రూ.కోటి సంపాదిస్తారనుకున్నామని కానీ, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మీరు ఎకరాకు ఎలా సంపాదిస్తున్నారో, అలాగే రైతులు కూడా పండించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను అందర్నీ ఫాంహౌస్ తీసుకెళ్లాలని సూచించారు.
అసలు, కెసిఆర్ తన ఫాంహౌస్లో ఎకరాకు రూ.కోటి సంపాదిస్తే ఇజ్రాయెల్ వెళ్లడం ఎందుకని ప్రశ్నించారు. ఇజ్రాయెల్, చైనాలను రైతులను తీసుకు వెళ్లారా అని ప్రశ్నించారు. ఎకరాకు రూ.15వేలు ఇస్తే తన పొలంతో, రైతుల పొలాలు అన్నింటిని కెసిఆర్కు లీజుకు ఇస్తామని ఎద్దేవా చేశారు.