కేజ్రీవాల్కు తలనొప్పి: తొలగింపుకు పట్టుబడ్తున్నారు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత కొద్ది రోజులుగా 'చీపురు' పార్టీలో విభేదాలు కనిపిస్తున్నాయి. విభేదాలను పరిష్కరించే ఉద్దేశ్యంతో ఇరువర్గాలు భేటీ అయ్యాయి. కానీ, విభేదాలకు ఫుల్స్టాఫ్ పడేలా కనిపించడం లేదు. పైగా, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేతలు, యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్లను పార్టీ నుండి బహిష్కరించే యోచనలో ఉన్నారు.
పార్టీ నుండి బహిష్కరించే కంటే ముందే.. రాజీనామా చేయాలని మరో సీనియర్ నేత అశుతోష్ యోగేంద్ర, భూషణ్లకు సలహా ఇచ్చారంటున్నారు. జాతీయ కార్యవర్గం నుండి రాజీనామా చేయాల్సిందిగా అరవింద్ కేజ్రీవాల్ వర్గం తమను బలవంతం చేస్తోందని, తమ సూచనలు వేటినీ కేజ్రీవాల్ పట్టించుకోవడం లేదని యోగేంద్ర, భూషణ్లు గురువారం ఆరోపించారు.
శనివారం జాతీయ కార్యవర్గం భేటీ నిర్వహించనన్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ కేజ్రీవాల్కు బహిరంగ లేఖ రాశారు. రాజీనామా చేయాలని లేదా జాతీయ కార్యవర్గం నుండి తొలగింపుకు సిద్ధం కావాలని రాజీ చర్చల్లో కేజ్రీవాల్ తఱఫున హాజరైన వారు తమను హెచ్చరించారని ఆరోపించారు. తామిద్దరం జాతీయ కార్యవర్గంలో ఉన్నంతకాలం కేజ్రీవాల్ జాతీయ కన్వీనర్గా కొనసాగేందుకు సుముఖంగా లేరని తమకు చెప్పారన్నారు.
వారి ప్రతిపాదనను తాము నిరాకరించామని, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఫణంగా పెడుతూ.. ఏదైనా పదవి లేదా బాధ్యతలను ప్రతిపాదిస్తూ చేసే చర్చలకు వ్యతిరేకమన్నారు. కేజ్రీవాల్తో భేటీకి సమయం కోరి 10 రోజులు గడిచినా స్పందన లేకపోవడంతో లేఖ రాయాల్సి వస్తోందని వారు తాము రాసిన లేఖలో పేర్కొన్నారు. కేజ్రీవాల్ను జాతీయ కన్వనర్ పదవి నుండి తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారని, అందుకే చర్చలు విఫలమయ్యాయని అశుతోష్ అన్నారు.