కొత్త పార్టీ ఊపు: కిరణ్పై 'సమైక్య సింహం' పుస్తకం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలకు ఓ పుస్తకం మరింత జోరు తీసుకు వచ్చింది! సిడబ్ల్యూసి నిర్ణయం వచ్చినప్పటి నుండి కిరణ్ సమైక్యాంధ్ర గళం వినిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రజలు లేకుంటే పార్టీలు ఉండవంటూ పార్టీ అధిష్టానాన్ని హెచ్చరించారు కూడా. సమైక్య గళం వినిపిస్తున్న కిరణ్ సీమాంధ్రలో ప్రజల మనసును గెలుచుకున్నారని కాంగ్రెసు నేతలు పలువురు చెబుతున్నారు.
కొత్త పార్టీ పెట్టాలంటూ కిరణ్ పైన పలువురు ఒత్తిడి కూడా తీసుకు వస్తున్నారు. కొత్త పార్టీ ఊసెత్తవద్దని కిరణ్ చెప్పినప్పటికీ ఆ ఊహాగానాలకు తెరపడటం లేదు. తాజాగా 'సమైక్యాంధ్ర సింహం' పేరుతో ఓ బుక్లెట్ వెలువడింది. ఇందులో కిరణ్ను సమైక్యాంధ్ర సింహంగా పేర్కొన్నారు. పుస్తకంలో 18 పేజీలు ఉన్నాయి. అందులో సిడబ్ల్యూసి నిర్ణయం తర్వాత ముఖ్యమంత్రి విభజనపై మాట్లాడిన అంశాలను అందులో పేర్కొన్నారు.
అయితే ఆ పుస్తకం పైన ముద్రించిన వారి, ఎక్కడ ముద్రించారనే వివరాలు లేవు. అయితే ఈ పద్దెనిమిది పేజీల పుస్తకం ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది. అసెంబ్లీ తీర్మానం తర్వాత అధిష్టానం విభజనకే మొగ్గు చూపితే కిరణ్ కొత్త పార్టీ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని మరోసారి జోరుగా చర్చ సాగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలలోకి వెళ్లలేని పలువురు కాంగ్రెసు నాయకులు కిరణ్ పార్టీ కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.
మరోవైపు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పేరుతో ఇప్పటికే ఓ పార్టీ పేరు రిజిస్టర్ అయిందట. ఈ పార్టీ చిరునామాగా హైదరాబాదులోని ఎల్లారెడ్డిగూడను ఇచ్చారని తెలుస్తోంది. అయితే కిరణ్ కొత్త పార్టీ పెడతారనే ప్రచారాన్ని ఆయన వర్గం కొట్టి పారేస్తోంది. విభజన జరగదని కిరణ్ బలంగా నమ్ముతున్నారని, కాంగ్రెసు పార్టీకి విశ్వాసపాత్రులని, అలాంటప్పుడు ఆయనకు కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఎందుకు వస్తుందని ప్రశ్నిస్తున్నారు.